తెయూ
ఆరోపణలు నిజమైతే..
● 2013లో జరిగిన అధ్యాపకుల ఎంపికపై జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు
● ఈనెల 14న విచారణకు హాజరు కావాలని వర్సిటీ అధికారులకు ఆదేశం
నియామకాల వ్యవహారం
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో గతంలో జరిగిన అధ్యాపకుల నియామకాల వ్యవహారం తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది. నియామకాల్లో కనీస నిబంధనలు పాటించలేదంటూ బాధితుడు అంగోత్ వెంకట్నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయగా, ఆ నియామకాలపై కమిషన్ దృష్టిసారించింది. ఈనెల 14న హైదరాబాద్లోని దిల్కుష గెస్ట్హౌస్లో విచారణకు హాజరు కావాలని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ, తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్తో పాటు బాధితుడు వెంకట్నాయక్కు ఎస్టీ కమిషన్ డైరెక్టర్ కల్యాణరెడ్డి సోమవారం నోటీసులు జారీ చేశారు.
అన్ని రికార్డులతో రావాలంటూ..
తెలంగాణ యూనివర్సిటీలో 2013లో చేపట్టిన అధ్యాపకుల నియామకాల్లో తనకు అన్యాయం జరిగిందంటూ బాధితుడు వెంకట్నాయక్ గత నెల 16న ఎస్టీ కమిషన్ను ఆశ్రయించారు. ఎస్టీ అభ్యర్థులకు చెందాల్సిన రోస్టర్ పాయింట్లలో అక్రమాలు జరిగాయని, రిజర్వేషన్ పాలసీ, రోస్టర్ విధానాన్ని సక్రమంగా పాటించలేదనే ఆరోపణలు చేశారు. దీనిపై కమిషన్ స్పందిస్తూ విచారణకు ఆదేశించింది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, తెయూ రిజిస్ట్రార్తో పాటు బాధితుడు వెంకట్నాయక్ విచారణ కేంద్రంలో వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు. కేవలం సమాధాన పత్రాలు పంపడం కాకుండా, 2013 నాటి నియామక నోటిఫికేషన్, రోస్టర్ పాయింట్ రిజిస్టర్లు, ఎంపిక జాబితాలు, మెరిట్ లిస్ట్లతో సహా అన్ని సంబంధిత అసలు రికార్డులను తీసుకొని విచారణకు హాజరుకావాలని నోటీసులో స్పష్టం చేసింది.
తెయూ పరిపాలనా భవనం
ఆ నియామకాల్లో రోస్టర్ పాయింట్ల గందరగోళం నిజమేనని జాతీయ ఎస్టీ కమిషన్ విచారణలో తేలితే, తెలంగాణ యూనివర్సిటీ అధికారులకు ఇది పెద్ద దెబ్బగా పరిణమించే అవకాశం ఉందని విద్యావేత్తలు అంటున్నారు. ఇప్పటికే ఈ నియామకాలను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ వేయాలని హైకోర్టు జడ్జి సింగిల్ జడ్జి తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పు పై పలువురు అధ్యాపకులు హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు డివిజన్ బెంచ్ వద్ద ఉంది. అయితే ఇదే సమ యంలో జాతీయ ఎస్టీ కమిషన్ స్వయంగా జో క్యం చేసుకోవడం, పైగా అధికారులను నేరుగా హాజరు కావాలని ఆదేశించడంతో ఈ విచారణ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విచారణ తర్వాత వర్సిటీ నియామకాలపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనని వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నోటీసు విషయమై తెయూ రిజిస్ట్రార్ యాదగిరిని ‘సాక్షి’ సంప్రదించగా ఇప్పటి వరకు తమకు ఎలాంటి నోటీసు అందలేదని తెలిపారు.


