రుద్రూర్: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నీట మునిగిన వరి పొలాల్లో నీటిని వీలైనంత త్వరగా తొలగించాలని, పూర్తిగా కుళ్లిపోయిన మొక్కలను గుర్తించి తిరిగి నాటుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. రుద్రూర్ ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తలు సమతా పరమేశ్వరి, సాయిచరణ్, మంజు భార్గవి, రమ్య రాథోడ్ శనివారం కోటగిరి మండలం సైలంపూర్ గ్రామ శివారు, పోతంగల్ మండలం తిర్మలా పూర్ గ్రామశివారులో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు యాజమాన్య సూచనలు చేశారు.
● వరి ఆకులు పసుపు రంగులోకి మారినట్లు గమనిస్తే 2 శాతం యూరియా లేదా 19:19:19 ఎరువును లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేయాలి.
● కాండం తొలిచే పురుగు నివారణకు నాట్లు వేసిన 25 రోజుల తర్వాత ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ వేయాలి, అలాగే ఎకరాకు 5–6 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసి పురుగుల ఉనికిని ఎప్పటికప్పుడు గమనించాలి. పురుగు ఉధృతి అధికంగా ఉంటే ఎకరాకు 400 గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 60 మిల్లీలీటర్ల క్లోరాంట్రానిలిప్రోల్ను పిచికారీ చేయాలి.
● బ్యాక్టీరియా ఎండాకు తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే యూరియా వినియోగాన్ని నిలిపివేయాలి, వ్యాధి సోకిన మడి నుంచి కింది పొలాలకు నీరు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి. వ్యాధి ఉధృతి తగ్గించేందుకు ఎకరాకు 80 గ్రాముల ప్లాంటమైసిన్, 600 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ను పిచికారి చేయాలి.


