పెద్దకొడప్గల్(జుక్కల్): భోజనం చేస్తుండగా గుండెపోటుతో ఒకరు మృతి చెందిన ఘటన పెద్దకొడప్గల్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జుక్కల్ మండలం నాగల్గావ్ గ్రామానికి చెందిన కాంబ్లే భీంరావ్ (35) హైదరాబాద్లో తాపీ మేస్త్రి పని చేస్తూ జీవించేవాడు. వారానికోసారి ఇంటికి వచ్చేవాడు. ఆదివారం తన బావ సాయిలుతో కలిసి ఇంటికి వస్తుండగా ఆకలి వేయడంతో పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని దాబా వద్ద ఆగారు. దాబాలో భోజనం చేస్తుండగా భీంరావ్ కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వారు బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అదే సమయంలో 108 అంబులెన్స్ ఆస్పత్రికి చేరుకొని భీంరావ్కు సీపీఆర్ చేసినా ఫలితం దక్కలేదు. బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య కాంబ్లే జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు.
● పెద్దకొడప్గల్లో నాగల్గావ్ వాసి మృతి


