వేటు కంటిన్యూ!? | - | Sakshi
Sakshi News home page

వేటు కంటిన్యూ!?

Jul 18 2026 9:51 AM | Updated on Jul 18 2026 9:51 AM

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లాలో భూ అక్రమాలకు వత్తాసు పలికిన రెవెన్యూ అధికారులపై వేట మొదలైంది. జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో అసైన్డ్‌, నిషేధిత భూములకు పట్టాలు జారీ చేసిన అక్రమార్కులు మరికొందరు ఉన్నట్లు తెలిసింది. ధరణిలోని లొసుగులను అనుకూలంగా మార్చుకొని కొందరు కాసులు దండుకున్నారు. రాష్ట్రస్థాయిలో విచారణ జరగడంతో జిల్లాలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నందిపేట తహసీల్దార్‌ సంతోష్‌రెడ్డిపై కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు వేసింది.

అక్రమాలు అనేకం..

నందిపేట మండలంలో అనేక అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలింది. గతంలో ఓ రెవెన్యూ అధికారి మండల కేంద్రంలోని చెరువు ప్రాంతంలో వెలసిన వెంచర్‌కు అనుమతులు జారీ చేశారు. ఇందులో ఇరిగేషన్‌కు సంబంధించిన ఏడు ఎకరాల స్థలం ఉన్నా నాటి రెవెన్యూ అధికారి ఆగమేఘాల మీద అనుమతులు జారీ చేయడం గమనార్హం.

● నందిపేటలో ఓ అధికారి తాను పనిచేస్తున్న కా లంలో 25 ఫైల్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా పూర్తిచేసి ఒక్కో ఫైల్‌కు రూ. 3 లక్షల చొప్పున వసూలు చేసినట్లు కలెక్టర్‌ పరిశీలనలో తేలింది. దీంతో ఆ అధికారిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఇదే ప్రాంతంలో ఓ రేషన్‌ డీలర్‌ మధ్యవర్తిగా ఉంటూ ప్రభుత్వ భూములను పట్టాలుగా మార్చి అధికారులకు లంచాలు ఇస్తూ కోట్లు సంపాదించాడని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఓ మీసేవ కేంద్రం నిర్వాహకుడి హస్తం ఉన్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ఈ వ్యవహారంలో విచారణ కొనసాగుతుంది.

● జిల్లా కేంద్రంలోని బైపాస్‌ రోడ్‌లో మూడెకరాల 20 గుంటల ప్రభుత్వ భూమిని ఓ వెంచర్‌లో కలిపేసుకున్నారు. ఈ వ్యవహారం బయటకు రాకుండా ఇద్దరు తహసీల్దార్లను ఉన్నఫలంగా బదిలీ చేయించారు. ఓ బడా వ్యాపారి వెంచర్‌లో ఇనాం భూములకు రెవెన్యూ అధికారి ఒకరు భారీ మొత్తంలో లంచాలు తీసుకొని క్లియరెన్స్‌ జారీ చేసినట్లు ఆరోపణలున్నాయి.

● ధర్మపురి హిల్స్‌ ప్రాంతంలోని 41 ఎకరాల బొందమ్‌ చెరువు 19 ఎకరాలకు కుచించుకుపోయింది. ఇక్కడ గుట్టలు, రాళ్లలో సైతం పట్టాలు ఉన్నాయని ఇళ్లు నిర్మించుకున్నారు. ఈ వ్యవహారంలో మాజీ కా ర్పొరేటర్లు ఇద్దరు భారీ మొత్తంలో డబ్బులు వసూ లు చేసి అసైన్డ్‌ భూములను ప్లాట్లుగా మార్చి విక్ర యించారు. అప్పటి కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రభు త్వ భూములకు ఫెన్సింగ్‌ వేయించారు. ఆయన బదిలీ అనంతరం మళ్లీ భూములను కబ్జా చేశారు. ఈ వ్యవహారంలో ఓ ఉన్నతాధికారి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది.

● న్యాల్‌కల్‌ నుంచి నిజామాబాద్‌కు వచ్చే ప్రాంతంలో నక్కల వాగు రెండుగా చీలి ప్రవహిస్తుంది. ఇందులో పోచమ్మగల్లి వైపు వచ్చే వాగు ప్రస్తుతం కనుమరుగైంది. ఈ వాగుపై రెండు వెంచర్లు వెలిశాయి. దీనికి సైతం రెవెన్యూ అధికారులు అనుమతులు ఇ చ్చేశారు. ఓ ఉన్నతాధికారి రెండు ప్లాట్లను గిఫ్ట్‌గా తీ సుకొని అనుమతులు జారీ చేసినట్లు సమాచారం.

● కంఠేశ్వర్‌ ప్రాంతంలో వాగుకు ఆనుకొని రెవెన్యూ ఉద్యోగి ఒకరు 600 గజాల స్థలాన్ని కబ్జా చేశాడు. పహణీలో వాటి సర్వే నంబర్లను మార్చారని సమాచారం. ఆర్మూర్‌ రోడ్డులోని ఓ ప్రయివేటు వ్యక్తి స్థలాన్ని నార్త్‌ తహసీల్‌ కార్యాలయ ఉద్యోగి ఒకరు పహణీలో మార్పులు చేసి మరొకరికి అనుకూలంగా మార్చినట్లు తెలుస్తోంది.

సస్పెన్షన్ల పర్వం..

ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నందిపేట తహసీల్దార్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇదే ప్రాంతంలో మరో ఇద్దరిపై సస్పెన్షన్‌ వేటు పడే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇందిరమ్మ ఇళ్లకు సరఫరా చేసే ఇసుకను బయటకు విక్రయించిన మెండోరా ఆర్‌ఐపై కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు వేసింది. పహానీలో మార్పులు చేసిన నార్త్‌ రూరల్‌ తహసీల్‌ కార్యాలయంలోని రికార్డు అసిస్టెంట్‌ సస్పెండ్‌ అయ్యారు. ఇలా రెవెన్యూ శాఖలో జరుగుతున్న అక్రమాలు బయటపడుతుండడంతో ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురవుతున్నారు. ప్రస్తుతం ధరణి అంశంలో జరుగుతున్న విచారణతో మరికొందరు రెవెన్యూ అధికారుల అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. నవీపేట, బోధన్‌, ఎడపల్లి, ఆర్మూర్‌, డిచ్‌పల్లి ప్రాంతాలలో భారీ మొత్తంలో అక్రమాలు జరిగినట్లు సమాచారం. వీటిపై సీసీఎల్‌ నుంచి త్వరలోనే ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని తెలిసింది.

సిరికొండ ప్రాంతంలోని అసైన్డ్‌ భూము లను ఓ మాజీ ప్రజాప్రతినిధి భర్త ఆక్రమించగా.. సహకరించిన రెవెన్యూ అధికారికి డిచ్‌పల్లి ప్రాంతంలో ఓ ప్లాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ట్లు తెలిసింది. డిచ్‌పల్లి, నిజామాబాద్‌ రూరల్‌, ధ ర్పల్లి, ఇందల్వాయిలో ఎక్కువ మొత్తంలో అ సైన్డ్‌ భూములను పట్టా భూము లుగా మార్చినట్లు ఆరోపణలున్నాయి. నవీపేట ప్రాంతంలో ఓ ఎకై ్సజ్‌ కానిస్టేబుల్‌ 300 గజాల స్థలం కబ్జా చేసి పట్టా పొందినట్లు సమాచారం.

సంతోష్‌రెడ్డిని సర్వీస్‌ నుంచి తొలగించండి

ఇటీవల సస్పెన్షన్‌ వేటు పడిన నందిపేట తహసీల్దార్‌ సంతోష్‌ రెడ్డిని సర్వీస్‌ నుంచి తొలగించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సీసీఎల్‌కు ప్రతిపాదించారు. రెవెన్యూ అధికారిగా ఉంటూ ప్రభుత్వ భూములను అక్రమంగా ఇతరులకు కేటాయించడంతోపాటు అనేక అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.

బట్టబయలైన భూ అక్రమాలు

విచారణలో విస్తుపోయే నిజాలు

ప్రభుత్వ భూములకు ఎసరు

ఇష్టారాజ్యంగా పట్టాల జారీ

రెవెన్యూ అధికారుల మాయాజాలం

ఇప్పటికే పలువురిపై చర్యలు

ఉపేక్షించే ప్రసక్తే లేదు

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎలాంటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. ఇది వరకే ఓ తహసీల్దార్‌పై వేటు పడింది. ప్ర భుత్వ భూముల వివరాలన్నీ రికార్డుల్లో ఉంటాయి. అధికారుల పరిశీలనలోనూ ఉంటాయి. దీంతో ఎవరు అక్రమాలకు పాల్పడినా తెలిసిపోతుంది.

– గీత, డీఆర్వో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement