సిరికొండ: పులి సంచరించినట్లు ఆనవాళ్లు కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సిరికొండ ఫారెస్ట్ రేంజర్ నర్సింగ్రావు మంగళవారం ఒక ప్రకటనలో ప్రజలను కోరారు. జిల్లాలోని సిరికొండ మండలానికి ఆనుకొని ఉన్న కమ్మర్పల్లి రేంజ్లో పెద్దపులి సంచారం ఉన్నందున ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పొలాల వద్ద విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయొద్దని, రాత్రి వేళల్లో అటవీప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు.
నిజాంసాగర్: పంటలకు సాగునీరందించేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. నిజాంసాగర్ ప్రధాన కాలువకు బాన్సువాడ మండల పరిధిలో బుంగపడడంతో పది రోజుల నుంచి సాగు నీరు లేక పొలాలు ఎండుతున్నాయి. బుంగకు మరమ్మతు పనుల నేపథ్యంలో లీకేజీ నీటిని మంజీర నదిలోకి మళ్లించడంతో జలాలు వృథా అవుతున్నాయి. అయితే మహమ్మద్నగర్ మండలం గాలీపూర్ గ్రామ రైతులు ఈ నీటిని తమ పంటలకు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం ప్రధాన కాలువలో అడ్డుకట్ట వేసి నీటిని డిస్ట్రిబ్యూటరీకి మళ్లించారు. బుంగ మరమ్మతులు పూర్తయిన తర్వాత ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు సాగు నీటిని విడుదల చేస్తామని నిజాంసాగర్ ప్రాజెక్టు ఈఈ సోలొమన్ తెలిపారు.
కామారెడ్డి అర్బన్: జిల్లా కేంద్రంలోని శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం వైదిక స్మార్త ఆగ మ వేదపాఠశాలలోని 12 మంది విద్యార్థులకు సామూహిక ఉపనయన ఉత్సవం నిర్వహించనున్నారు.
ఈనెల 8న దేవునిపల్లి బ్రహ్మంగారి ఆలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ధర్మ పీఠం అధిపతి శీర్లవంచ కృష్ణామాచార్యులు, వేద విద్యార్థులు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని కలిసి కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానించారు.


