పంచ పరివర్తనను గ్రామాలకు తీసుకెళ్లాలి
డిచ్పల్లి: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ డిచ్పల్లి ఖండ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శ్రీకాశీ విశ్వనాథ ఆలయం ఆవరణలో ఆదివారం ఆర్ఎస్ఎస్ శాఖల సంగమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సేవా ప్రముఖ్ దాసరి గంగాధర్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ ప్రారంభమై నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. ఆర్ఎస్ఎస్కు ప్రతిరోజు గంటసేపు జరిగే ‘నిత్యశాఖ’ ప్రాణమని, శాఖలో చేసే వ్యాయామం, సూర్య నమస్కారాలు, సమత, దేశభక్తి గీతాల ద్వారా స్ఫూర్తి పొందిన అనేకమంది స్వయం సేవకులు దేశం కోసం నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. క్రమశిక్షణ, సమయపాలన, దేశభక్తి, ధర్మనిష్ట, వ్యక్తిగత శీలం, జాతీయ శీలం, సంస్కారం, సంస్కృతి పరిరక్షణ అనే ఎన్నో సుగుణాలను శాఖ ఆధారంగా స్వయంసేవకులు ఉపాసన చేస్తున్నారని పేర్కొన్నారు. స్వయం సేవకులు సేవా కార్యక్రమాలను అందిస్తున్నారని తెలిపారు. సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పంచ పరివర్తన (సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ భావన నిర్మాణం చేయడం, పౌర నియమాలు నిరంతరం పాటించేలా చైతన్యం చేయడం) కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. పంచ పరివర్తనను గ్రామ గ్రామానికి తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేసి దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లడం కోసం సంఘ్ పనిచేస్తుందని దాసరి గంగాధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖండ కార్యవాహ ఎల్.సంతోష్, బండి సోమనాథ్, హరీష్, బొద్దుల చక్రపాణి, సత్యనారాయణ, ప్రభాకర్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


