‘సాగర్’కు పర్యాటక శోభ
అభివృద్ధికి కృషి..
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టు పర్యాటక శోభను సంతరించుకుంటోంది. టూరిజం పనులు జోరుగా సాగుతున్నాయి. 1923–31 మధ్యకాలంలో నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. ‘ఎన్’ ఆకారంలో ప్రాజెక్టు నిర్మించగా ప్రధాన ఇంజినీర్తో పాటు ఇంజినీర్లు, కూలీలు సేద తీరేందుకు గోల్బంగ్లా, ఛత్రిబంగ్లా, రెస్ట్హౌస్, గెస్ట్హౌస్, స్విమ్మింగ్ పూల్, వాటర్ ఫౌంటెయిన్, సమ్మర్బాగ్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నిర్మించి వందేళ్లు కావస్తున్నా ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉంది. ప్రాజెక్టు పరిసరాల్లో నిర్మించిన కట్టడాలు మాత్రం నిర్వహణ లేక మూలనపడ్డాయి. అయితే 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన సమయంలో నిజాంసాగర్ను బృందావనంలా మారుస్తానని పేర్కొన్నారు. ప్రాజెక్టు వద్ద పర్యాటక అభివృద్ధి కోసం అప్పట్లో ఇంజినీర్లు సర్వే చేసి 500 ఎకరాల భూములు గుర్తించారు. అయితే వైఎస్సార్ అకాల మరణంతో పట్టించుకునేవారు లేకుండాపోయారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తుత జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నిజాంసాగర్ ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రభుత్వం స్పందించి రూ. 10 కోట్లు మంజూరు చేసింది.
12 ఎకరాల్లో పనులు..
నిజాంసాగర్ ప్రాజెక్టు గోల్ బంగ్లా వద్ద ఎకో టూరిజం పనుల కోసం 12 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రూ.7.7 కోట్ల నిధులతో గుల్దస్తా వద్ద టూరిజం పనులు చేపట్టారు. 17 కాటేజీలు, 7 సూట్లు, 2 రెస్టారెంట్లు, డార్మెట్ రూం, యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి పనులు చేపడుతున్నారు. అంతేకాకుండా ప్రాజెక్టు 16 గేట్ల వద్ద పర్యాటకుల కోసం బోటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. పనులన్నీ పూర్తయితే ప్రాజెక్టు మరింత పర్యాటక శోభను సంతరించుకుంటుందన్న ఆశాభావాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
వెనకబడిన ప్రాంతంగా పేరున్న జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఎకో టూరిజం పనులు చేపట్టాం. నియోజకవర్గంలోని కౌలాస్కోట, కౌలాస్ ప్రాజెక్టు, ఎల్లమ్మ ఆలయాలను సైతం పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం.
– లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యే, జుక్కల్
అందుబాటులోకి
బోటింగ్ సదుపాయం
ఊపందుకున్న కాటేజీలు,
రెస్టారెంట్ల నిర్మాణం
జోరుగా సాగుతున్న అభివృద్ధి పనులు
‘సాగర్’కు పర్యాటక శోభ
‘సాగర్’కు పర్యాటక శోభ


