కొనసాగుతున్న జూడాల నిరసన
సుభాష్నగర్: ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శాశ్వత కళాశాల మైదానం కేటాయించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు, మెడికల్ విద్యార్థుల నిరసన నాలుగో రోజు శనివారం కొనసాగింది. జీజీహెచ్ ఓపీ గేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ వంటి క్రీడలు ఆడి నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ కోసం విద్యార్థులు శాంతియుతంగా, క్రమశిక్షణతో నిరసన కొనసాగిస్తున్నారని జూడా అధ్యక్షుడు డాక్టర్ కార్తిక్ తెలిపారు. 13 ఏళ్లుగా కళాశాల కొనసాగుతున్నా.. శాశ్వత గ్రౌండ్ కేటాయించకపోవడం బాధాకరమన్నారు. మెడికల్ విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జూడా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయంత్, ప్రతినిధులు డాక్టర్ భవాని, డాక్టర్ జితిన్, డాక్టర్ చంద్రకాంత్, డాక్టర్ శివాణి, మెడికల్ విద్యార్థులు, జూడాలు పాల్గొన్నారు.


