
ఢిల్లీలో ఇందూరు కాంగ్రెస్ నేతలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేపట్టిన ఆందోళనకు నిజామాబాద్ జిల్లా నుంచి నాయకులు తరలివెళ్లారు. ఈ రిజర్వేషన్ల విషయమై కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు పార్టీ తలపెట్టిన ఈ పోరుకు జిల్లా నుంచి మంచి స్పందన వచ్చింది. ఢిల్లీలో తమ గళాన్ని బలంగా వినిపించారు. పీసీసీ అధ్యక్షుడు నిజామాబాద్ జిల్లా నుంచే ఉండడంతో జిల్లా నాయకులు పార్టీ పోరుబాట కార్యక్రమంలో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో మంచి జోష్ వచ్చింది. ఈ పోరుబాటతో రానున్న స్థానిక ఎన్నికల్లో తమకు తిరుగులేని విధంగా కలిసి వస్తుందని పార్టీ శ్రేణులు అంచనాలు వేసుకుంటున్నాయి. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఈ నెల 2, 3 తేదీల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో నిర్వహించిన జనహిత పాదయాత్ర కార్యక్రమం, శ్రమదానం కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. అదేవిధంగా పార్టీ కార్యవర్గం, అనుబంధ సంఘాల బాధ్యులు, అన్ని మండలాల బాధ్యులతో నిర్వ హించిన ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశం పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ స్థాయిలో విజయాలు సాధిస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
జంతర్మంతర్కు జిల్లా నాయకులు..
బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్తోపాటు సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. నేడు రాష్ట్రపతికి వినతిపత్రం అందజేయనున్నారు. జంతర్మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళనలో జిల్లా నుంచి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, ఆకుల లలిత, మునిపల్లి సాయిరెడ్డి, దయాకర్ గౌడ్, బాస వేణుగోపాల్యాదవ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్గౌడ్, సకినాల శివప్రసాద్, నరాల రత్నాకర్, సుమన్, గన్రాజ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ల సాధన పోరుకు
తరలివెళ్లిన శ్రేణులు
ఇటీవల జిల్లాలో జనహిత పాదయాత్ర సక్సెస్తో మరింత జోష్
పీసీసీ అధ్యక్షుడు జిల్లా నుంచే
ఉండడంతో ఢిల్లీ పోరుకు భారీ
స్పందన
పథకాలపై పాజిటివ్ టాక్..
సన్నబియ్యం పంపిణీ పథకం నేపథ్యంలో ప్రభుత్వంపై సానుకూల స్పందన వస్తోంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలోనూ ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు వెళ్తోంది. ఇక భూభారతి ద్వారా భూ సమస్యలను పరిష్కరించే విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించనున్నట్లు పార్టీ నాయకులు, ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. రైతుభరోసా, సన్నధాన్యం, రైతులకు ఇవ్వనున్న బోనస్ సైతం తమకు కలిసివస్తాయని పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. దీంతో తమకు స్థానిక ఎన్నికల్లో ఎలాంటి ఢోకా లేదనే ఆశాభావంతో ఉన్నారు.

ఢిల్లీలో ఇందూరు కాంగ్రెస్ నేతలు