
క్రైం కార్నర్
దుస్తుల షాపు దగ్ధం
మాక్లూర్: మండలంలోని ముల్లంగి(బి)లో శనివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో బట్టల షాపు దగ్ధం కాగా సుమారు రూ. 12 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన నీరడి ప్రశాంతి నాలుగేళ్ల క్రితం గ్రామంలో కిరాణ షాపుతో పాటు బట్టల షాపును నిర్వహిస్తున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా పెద్ద మొత్తంలో చీరలు కొనుగోలు చేసి దుకాణంలో పెట్టారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారు జామున షార్ట్సర్క్యూట్ జరగడంతో షాపులో ఉన్న వస్తువులు, బట్టలన్నీ కాలిపోయాయి. ప్రమాద విషయమై తహసీల్దార్కు ఫిర్యాదు చేయగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ పంచనామా నిర్వహించినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్పల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సందీప్ శనివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. చంద్రాయన్పల్లి శివారులోని జాతీయ రహదారి పక్కన కుళ్లిన స్థితిలో వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉందని, మృతుడి ఒంటిపై నెవీ బ్లూ కలర్ ప్యాంట్, తెల్లటి బనియన్, వైట్ అండ్ బ్రౌన్ చెక్స్ కలిగిన షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712659854 నంబర్కు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.
పేకాట స్థావరంపై దాడి
తాడ్వాయి: మండల కేంద్రంలోని పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్సై మురళి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలోని ఓ రేకుల షెడ్డు వద్ద పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో ఇద్దరిని పట్టుకోగా వారి నుంచి రూ. 1700 నగదును, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా పేకాట ఆడితే కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు.
విద్యుత్షాక్తో మేకలు మృతి
ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని అడివిలింగాల గ్రామ శివారులో విద్యుత్ షాక్ తగిలి రెండు మేకలు మృతి చెందినట్లు స్థానికులు శనివారం తెలిపారు. గ్రామంలోని మహ్మద్ సలీంకు చెందిన మేకలు గ్రామ శివారులో మేత మేస్తుండగా ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన విద్యుత్ తీగలు తగలడంతో షాక్ తగిలి మృతి చెందాయి. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి నష్ట పరిహారం అందేలా చూడాలని బాధితుడు కోరుతున్నాడు.
యువకుడి అదృశ్యం
మోపాల్: మండలంలోని నర్సింగ్పల్లికి చెందిన దుబ్బాక సాయితేజ అదృశ్యమైనట్లు ఎస్సై జాడె సుస్మిత శనివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయితేజ విజయ్ రూరల్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. అక్కడే హాస్ట ల్లో ఉంటున్నాడు. సెలవుల కోసం నర్సింగ్పల్లికి వచ్చిన సాయితేజ ఆ తర్వాత హాస్టల్కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. సుమారు రెండు నెలల నుంచి సాయితేజ కనిపించకపోవడంతో స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి దుబ్బాక సావిత్రి ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

క్రైం కార్నర్