నిర్మల్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ విద్యార్థులు గురువారం కలెక్టరేట్ ఎదు ట ధర్నా చేశారు. జీవో 97 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు కళాశాల ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకుని ధర్నా చేశారు. తర్వాత కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. వీరికి ఎస్ఎఫ్ఐ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ దిగంబర్ మాట్లాడుతూ... పాలిటెక్నిక్ ప్రమాణాలను మరింత పెంచాల్సి న ప్రభుత్వం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. డిప్లొమా కోర్సులను ఇతర శిక్షణ కోర్సులతో అనుసంధానం చేయడం తగదన్నారు. జీవో 97 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు నిలిపివేయాలన్నారు. కొత్త జీవో కారణంగా తాము బీటెక్ మొదటి సంవత్సరం నుంచి చదవాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.


