ఎంఆర్పీకి బిల్లు.. వసూలు అదనం నష్టపోతున్న రైతన్నలు పట్టించుకోని అధికారులు
తానూరు: ఎరువుల విక్రయాల్లో దళారుల ప్రమే యం లేకుండా పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం ఫెర్టిలైజర్ యాప్ వ్యవస్థ రూపొందింది. ఇంత వరకు బాగానే ఉన్న సంబంధిత అధి కారుల పర్యవేక్షణ లేకపోవడంతో డీలర్లు రైతుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో అన్నదాతపై అదనపు భారం పడుతోంది. ఆర్థికంగా నష్టపోతున్నారు. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులు తనిఖీలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
రైతుల ఫిర్యాదు ...
తానూరు మండలంలోని పలు గ్రామాల్లోని కేంద్రాల్లో సంబంధిత డీలర్లు ఒక్కో యూరియా బస్తాకు రూ.54 అదనంగా వసూలు చేస్తుండడంపై ఝరి(బి)తోపాటు పలు గ్రామాల రైతులు ఏవోకు ఫిర్యాదు చేశారు. బస్తాకు రూ.54 అదనంగా తీసుకుంటున్నారని తెలిపారు. స్పందించిన ఏవో డీలర్ల సెంటర్లు తనిఖీ చేస్తామని తెలిపారు.
చర్యలు తీసుకుంటాం
ఆయా గ్రామాల్లోని సెంటర్లలో యూరియా బస్తా బిల్లుకు అదనంగా వసూలు చేస్తున్నట్లు రైతులు ఫిర్యాదు చేశారు. మండలంలో ఉన్న సెంటర్లను తనిఖీ చేసి అదనంగా వసూలు చేసిన డీలర్లపై చర్యలు తీసుకుంటాం. అధిక ధలరకు విక్రయించేవారిపై రైతులు ఫిర్యాదు చేయాలి.
– మనీషా, ఏవో, తానూరు
ఈ రైతు పేరు అసం మాధవ్. తానూరు మండలం ఝరి(బి) గ్రామానికి చెందిన తన సోదరి సురేఖబాయి పేరిట ఆన్లైన్లో 3 యూరియా బస్తాలు బుక్చేశాడు. బోరిగాం గ్రామంలోని(డీసీఎంఎస్) డీలర్ వద్దకు వెళ్లి యూరియా బస్తాలు పొందాడు. ఽఒక బస్తా ధర రూ.266 కాగా రూ.320 తీసుకుంటున్నారు. సంబంధిత డీలర్ మూడు బస్తాలకు రూ.960 వసూలు చేసి.. బిల్లు మాత్రం రూ.798 ఇచ్చాడు. ఒక్కో బస్తాకు రూ.54 అదనంగా చెల్లించాడు. జిల్లాలోని రైతుల పరిస్థితి ఇలాగే ఉంది.


