నిర్మల్చైన్గేట్: రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ భవేశ్ మిశ్రా, అధికారులతో కలిసి సేంద్రీయ వ్యవసాయం, మార్కెటింగ్, ఉద్యానవన పంటల సాగు, ప్రభుత్వ ప్రోత్సాహం, రైతుల సంక్షేమం తదితరఅంశాలపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
రైతులు సేంద్రియ సాగుపై దృష్టి పెట్టాలి
ఈ సందర్భంగా చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ రైతులు సేంద్రియ సాగుపై దృష్టి పెట్టాలన్నారు. సంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి పంట మార్పి డి విధానం అమలు చేయాలని సూచించారు. ప్రస్తుతం మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ ఉందని, రైతులు పండించిన పంటలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
అందుబాటులో ఎరువులు, విత్తనాలు..
కమిషన్ సభ్యులు మాట్లాడుతూ జిల్లాలోని రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని, అవసరానికి మించి రసాయనిక ఎరువులు వాడకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పోడు భూముల సమస్యలు, మార్కెటింగ్ సదుపాయాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఉద్యానవన సాగుకు ప్రోత్సాహం..
కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో పంట మార్పిడి విధానాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని దాదాపు రెండు లక్షల మంది రైతులు వరి, మొక్కజొన్న, జొన్న, సోయా, కందులు వంటి పంటలను ఎక్కువగా పండిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఆయిల్ పామ్, పండ్లు, కూరగాయలు, పూల సాగు వంటి ఉద్యానవన రంగం వైపు రైతులను మళ్లిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దాదాపు 20 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగు జరుగుతుండగా, అందులో 8,300 ఎకరాల్లో ఆయిల్ పామ్, 5 వేల ఎకరాల్లో పసుపు సాగవుతున్నాయన్నారు. ఈ ఏడాది ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని అధిగమించామని పేర్కొన్నారు. రెవెన్యూ మ్యాపులు లేని 14 గ్రామాల్లో దాదాపు 30 వేల ఎకరాలకు సర్వే చేపడుతున్నామని, మరో 70 గ్రామాల్లో 62 వేల ఎకరాల భూముల సర్వే పూర్తి చేయనున్నట్లు తెలిపారు.


