
● ఆహ్లాదమా.. అడ్రసెక్కడా..!? ● వేసవిలో సేదతీరే.. చోటేది
ఆహ్లాదం.. బహుదూరం
నిర్మల్ నర్సాపూర్(జి) మండల కేంద్రంలో పల్లెప్రకృతివనం ఊరి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉంది. పర్లేదు.. అక్కడిదాకా వెళ్లి కాసేపు ప్రకృతిలో స్వచ్ఛమైన గాలి పీల్చుకుందామంటే.. పక్కనే డంపింగ్యార్డు ఏర్పాటు చేశారు. ప్రకృతివనం పచ్చగానే ఉన్నా.. పర్యావరణం సరిగా లేకపోవడంతో ఎవరూ వెళ్లే పరిస్థితి లేదు.
‘రూర్బన్’ తీరిది..
కుంటాల: మండలంలోని కల్లూరు సాయిబాబా ఆలయ ఆవరణలో రూ.60 లక్షల రూర్బన్ నిధులతో పార్కును ఏర్పాటు చేశారు. ఏమాత్రం నిర్వహణ లేదిక్కడ. చెట్లు ఎండిపోయాయి. ఫౌంటేన్, ఆటవస్తువులు, సిమెంట్ బెంచీలు, జిమ్ పరికరాలు విరిగిపోయాయి.
బాగానే ఉన్నా..!
సోన్: మండలంలోని న్యూవెల్మల్, బొప్పారం, కూచన్పల్లి, సంగంపేట, మాదాపూర్ పల్లెప్రకృతి వనాలను విజిట్ చేయగా, చూడటానికి బాగానే ఉన్నా.. సరిపడా నీరందక మొక్కలు ఎండుతున్నాయి. ఇంకా కొంత నిర్వహణ చేయాల్సి అవసరం ఉంది.
చెట్లు మాత్రమే ఉన్నాయి..
సారంగపూర్: మండలంలోని జామ్, దుర్గానగర్లో పల్లె ప్రకృతివనాల్లో చెట్లు ఉన్నా.. ఏమాత్రం పచ్చదనం, కనీస సౌకర్యాలు లేవు. చూడటానికీ కళావిహీనంగా మారాయి.
మియావాకీ.. సౌకర్యాలేవీ!
తానూరు: మండలం ఉమ్రి(కె)లో పచ్చని చెట్ల మధ్య వాకింగ్ చేయడానికి మియావాకీ పద్ధతిలో ప్రకృతివనం ఏర్పాటు చేశారు. జిల్లాలో పేరొందిన ఈ పార్కు బాగానే ఉన్నా.. పిల్లల ఆటవస్తువులు, జిమ్పరికరాల వంటి సౌకర్యాలు కల్పించాలి.
మాటేగాం.. నిర్వహణలోపం
భైంసారూరల్: మండలం మాటేగాంలో పచ్చని ప్రకృతివనం ఉన్నా.. నిర్వహణ, పరిశుభ్రత లోపాలతో ఆకట్టుకోవడం లేదు.
దేవునిగూడెంలో ఎండిపోయిన మొక్కలు
అక్కడలా.. ఇక్కడిలా..
లక్ష్మణచాంద: మండలంలోని రాచాపూర్, వడ్యాల్ గ్రామాల్లో పరిశీలించగా, ఊరికి దూరంగా ఉన్నాయి. పట్టించుకునే నాథుడు లేక, అవి పల్లె ప్రకృతి వనాలేనా..! అన్నట్లు తయారయ్యాయి. ఇదే మండలంలోని పొట్టపల్లి(కె)లో నిండుగా పచ్చనిచెట్లతో కళకళలాడుతోంది. జిల్లాలో ఉత్తమ పల్లె ప్రకృతివనంగా గుర్తింపుపొందింది.
ఎండిన ప్రకృతివనం..
దస్తురాబాద్: మండలంలోని దేవునిగూడెంలో నీళ్లు లేక పల్లె ప్రకృతివనం ఎండిపోయింది. పచ్చగా ఉండాల్సిన పార్కు నీళ్లు లేక కళావిహీనంగా మారింది.

● ఆహ్లాదమా.. అడ్రసెక్కడా..!? ● వేసవిలో సేదతీరే.. చోటేది

● ఆహ్లాదమా.. అడ్రసెక్కడా..!? ● వేసవిలో సేదతీరే.. చోటేది