‘నేను ఢిల్లీ నుంచి పోటీ చేస్తే 10 లక్షల ఓట్లు వస్తాయట’ | Youd Get A Million Votes In Delhi: Giorgia Meloni | Sakshi
Sakshi News home page

‘నేను ఢిల్లీ నుంచి పోటీ చేస్తే 10 లక్షల ఓట్లు వస్తాయట’

Jun 25 2026 5:44 PM | Updated on Jun 25 2026 6:17 PM

Youd Get A Million Votes In Delhi: Giorgia Meloni

ఢిల్లీ నుంచి పోటీ చేస్తే 10 లక్షల ఓట్లు వస్తాయంటూ ఉప ప్రధాని అంటోనియో అన్నారంటూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆసక్తికర విషయాలను తాజాగా తాను రాసిన పుస్తకంలో పంచుకున్నారు. 2023లో భారత్‌లో పర్యటించిన జార్జియా మెలోని ఆ సందర్భంగా జరిగిన పలు సంగతులను ప్రస్తావించారు. ఢిల్లీలో తనకు స్వాగతం పలకడానికి రహదారుల వెంట భారీ సంఖ్యలో తన ఫొటోలతో పోస్టర్లు ఏర్పాటు చేయడాన్ని చూసి ఆశ్చర్యపోయానంటూ ఆమె పేర్కొన్నారు.

మెలోనీ తన కొత్త పుస్తకం ‘జార్జియా విజన్‌’లో భారత్‌ పర్యటన జ్ఞాపకాలను రాసుకొచ్చారు. మెలోనీ 2023 మార్చిలో భారత్‌కు వచ్చినప్పుడు ఢిల్లీ రహదారుల వెంట తన ఫొటోతో పాటు 'వెల్‌కమ్' అని ఉన్న పోస్టర్లు కనిపించాయి. తిరుగు ప్రయాణం సమయంలో అదే పోస్టర్లపై ‘థాంక్యూ ఫర్ విజిటింగ్’ అని రాసి ఉండటం ఆమెను ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా తనతో పాటు వచ్చిన ఇటలీ ఉప ప్రధానమంత్రి అంటోనియో సరదాగా స్పందిస్తూ ఈ పోస్టర్లన్నీ చూస్తుంటే నువ్వు ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే కనీసం పది లక్షల ఓట్లు వస్తాయి” అని వ్యాఖ్యానించినట్లు మెలోనీ తన పుస్తకంలో రాశారు. మెలోని 2023లో రెండు సార్లు భారతదేశాన్ని సందర్శించారు. మొదట మార్చిలో జరిగిన 8వ 'రైసినా డైలాగ్' సదస్సు, ఆ తర్వాత సెప్టెంబర్‌లో జరిగిన జీ20 సదస్సు కోసం ఆమె భారత్‌కు వచ్చారు.

కాగా, ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మరోసారి తమ ప్రత్యేక కెమిస్ట్రీతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా ప్రపంచ నేతలంతా గ్రూప్‌ ఫొటో కోసం ఒకచోట చేరారు. ఈ సమయంలో మోదీ, మెలోనీ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ‘మిమ్మల్ని మళ్లీ కలవడం ఆనందంగా ఉంది’ అని మెలోనీ చెబుతూ.. ఆ వెంటనే సరదాగా "ఇన్‌స్టాగ్రామ్‌లో మనమే అత్యంత ప్రసిద్ధ జంట" అంటూ చమత్కరించారు. దీనికి మోదీ చిరునవ్వుతో స్పందించగా.. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement