భారత రాజ్యాంగం కేవలం చట్టాల సంపుటి కాదు.. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన లిఖిత దస్తావేజు. దీని నిర్మాణ లక్షణాలు, రాజకీయ సూత్రాలు, సంస్థాగత ఏర్పాటు ప్రపంచంలోని ఇతర రాజ్యాంగాల కన్నా ఎంతో భిన్నమైనవి. 448 అధికరణలు, 12 షెడ్యూళ్లు, పలు సవరణలతో మన రాజ్యాంగం ఎంతో వైవిద్యాన్ని కలిగివుంది. ఈ రోజు(నవంబర్ 26) భారత రాజ్యాంగ దినోత్సవం. ఈ సందర్భంగా మన రాజ్యాంగంలోని ప్రత్యేకతలను గుర్తు చేసుకుందాం.
సమాఖ్య నిర్మాణంలో ఐక్యతా స్ఫూర్తి
భారత రాజ్యాంగం దేశంలోని వివిధ ప్రాంతాలు, సంస్కృతులు, భాషా సమూహాల వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా వివరణాత్మకంగా రూపొందించారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కాకుండా, రాష్ట్రాలకు కూడా ఒకే ఏకీకృత రాజ్యాంగాన్ని కలిగి ఉన్న ఏకైక వ్యవస్థ. ఇది సమాఖ్య నిర్మాణంలోనూ ఏకత్వ స్ఫూర్తిని చాటుతుంది.
సవరణలకు అవకాశం
నిర్మాణపరంగా భారత రాజ్యాంగం దృఢత్వం (Rigidity), అనుకూలత (Flexibility)ల అద్భుత మిశ్రమం. కొన్ని నిబంధనలను సవరించడానికి పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ, రాష్ట్రాల ఆమోదం అవసరం అవుతుంది. కొన్నింటిని సాధారణ చట్టాల మాదిరిగానే మెజారిటీతో సులభంగా సవరించవచ్చు.
బ్రిటీష్ తరహాలో..
ఇక రాజకీయ లక్షణాల విషయానికి వస్తే, ఇది బ్రిటీష్ తరహా పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థను స్వీకరించింది. ఇక్కడ రాష్ట్రపతి నామమాత్రపు అధిపతి అయితే, ప్రజలచే ఎన్నికైన ప్రధానమంత్రి నిజమైన కార్యనిర్వాహక అధికారాన్ని నిర్వహిస్తారు. ఇది దేశంలో ప్రజల సార్వభౌమత్వాన్ని, కార్యనిర్వాహక వ్యవస్థ చట్టసభకు బాధ్యత వహించే విధానాన్ని నిర్ధారిస్తుంది.
పౌరులందరికీ సమాన అవకాశాలు
రాజ్యాంగం.. కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాలను స్పష్టంగా విభజించినప్పటికీ, యూనియన్ ప్రభుత్వం (కేంద్రం) అత్యవసర పరిస్థితుల్లో లేదా రాష్ట్రాల మధ్య విభేదాలు వచ్చినప్పుడు కీలక పాత్రను పోషిస్తుంది. మన రాజ్యాంగం కేవలం రాజకీయ సమానత్వాన్ని మాత్రమే కాకుండా, సార్వత్రిక వయోజన ఓటు హక్కు (18 ఏళ్లు పైబడిన ప్రతి పౌరునికి ఓటు హక్కు) ద్వారా పౌరులందరికీ సమాన అవకాశాన్ని ఇస్తుంది.
ఏక పౌరసత్వానికి పెద్దపీట
అంతేకాకుండా అమెరికా మాదిరిగా కాకుండా, భారతదేశం ఒకే పౌరసత్వాన్ని (Single Citizenship) మాత్రమే కలిగి ఉంది. ఇది దేశ పౌరులలో జాతీయ సమగ్రతను, ఐక్యతను పెంపొందిస్తుంది.
లౌకికవాద సిద్ధాంతం
ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే మరో విశిష్ట లక్షణం లౌకికవాద (Secular) సిద్ధాంతం. భారత దేశానికి అధికారిక మతం అంటూ ఏదీ లేదు. రాజ్యాంగం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది. వాటిని అనుసరించే స్వేచ్ఛపై పౌరులకు హామీనిస్తుంది.
ఐరిష్ రాజ్యాంగం నుండి..
హక్కులు, సూత్రాల విభాగంలో రాజ్యాంగం పౌరులకు ఆరు ప్రాథమిక హక్కుల హామీనిచ్చింది. ఇవి సమానత్వం, స్వేచ్ఛ, రక్షణ కల్పిస్తాయి. దీనికితోడు, ఐరిష్ రాజ్యాంగం నుండి ప్రేరణ పొందిన విధాన నిర్దేశక సూత్రాలు సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి.
స్వతంత్ర న్యాయవ్యవస్థకు హామీ
సంస్థాగత స్థాయిలో రాజ్యాంగం ఒక స్వతంత్ర న్యాయవ్యవస్థకు హామీనిస్తుంది. దీనికి న్యాయ సమీక్ష (Judicial Review) అధికారం ఉంది. తద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టులు రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలను రద్దు చేసే అధికారాన్ని కలిగి ఉన్నాయి. ఇది చట్టసభల నియంతృత్వాన్ని నిరోధిస్తుంది.
జర్మనీ ప్రేరణతో..
రాజ్యాంగంలోని అత్యవసర నిబంధనలు (జర్మనీ నుండి ప్రేరణ పొందినవి) జాతీయ సంక్షోభ సమయాల్లో యూనియన్ ప్రభుత్వం తాత్కాలికంగా అధిక అధికారాలను చేపట్టడానికి అనుమతిస్తాయి. 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీలు, మునిసిపాలిటీలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు ఇచ్చారు. దీంతో స్థానిక స్వపరిపాలనను బలోపేతం అవుతుంది. ఈ వ్యవస్థ ప్రజాస్వామ్య దృక్పథానికి నిదర్శనంగా నిలుస్తుంది.
స్వదేశీ సూత్రాలతో మిళితం
భారత రాజ్యాంగం ప్రపంచంలో వివిధ రాజ్యాంగాల ప్రేరణలను స్వదేశీ సూత్రాలతో మిళితం చేసింది. ఇందులో ప్రాథమిక హక్కులు యుఎస్ రాజ్యాంగం నుండి, పార్లమెంటరీ వ్యవస్థను యూకే నుండి, ఐర్లాండ్ నుండి ప్రాథమిక విధులను అనుసరించింది.
ప్రజాస్వామ్య ప్రక్రియల సమగ్రత
ఎన్నికల కమిషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్), యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తదితర ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా, రాజ్యాంగం ప్రజాస్వామ్య ప్రక్రియల సమగ్రతను చాటుతుంది. అలాగే పాలనలో జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది. ఇంతటి విశిష్ట లక్షణాలున్న భారత రాజ్యాంగం.. దేశ సాంస్కృతిక, రాజకీయ, సామాజిక ఆకాంక్షలకు దర్పణంగా నిలుస్తున్నది.


