
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో మమత బెనర్జీ (mamata banerjee) ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. పశ్చిమ బెంగాల్లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (West Bengal Teacher Scam 2016)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది.
అయితే వారిలో పశ్చిమ బెంగాల్ మాతృభాష బెంగాలీని బోధిస్తున్న సోమా దాస్ (School teacher Soma Das) అనే ఉపాధ్యాయురాలికి మాత్రం మినహాయింపు ఇచ్చింది. యథావిధిగా ఆమె ఉద్యోగంలో కొనసాగవచ్చని పేర్కొంది. ఇంతకి ఎవరీ సోమాదాస్? వేలాది మంది టీచర్ల నియామకాల్ని రద్దు చేసిన సుప్రీం.. ఆమె ఒక్కరే ఉద్యోగంలో కొనసాగవచ్చని ఎందుకు తీర్పు ఇచ్చింది.
సుప్రీం తీర్పుపై సోమాదాస్
2016లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేపట్టిన టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాల్లో సోమాదాస్ అనే మహిళ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. తాజాగా, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి పీవీ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం తన తీర్పుతో సోమాదాస్ ఉపాధ్యాయురాలిగా కొనసాగనున్నారు. ఓ వైపు సుప్రీం కోర్టు తీర్పుపై టీచర్గా కొనసాగే అవకాశం రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారనే నిరాశను వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు. నేను నిజంగా అదృష్టవంతురాలి. కానీ వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇది ఎవ్వరూ ఊహిచని విషయం అని తన అభిప్రాయాన్ని తెలిపారు.
దీదీ సర్కార్పై సోమాదాస్ న్యాయపోరాటం
2016లో కోల్కతా ప్రభుత్వం 9-10 తరగతి ఉపాధ్యాయ నియామక (ఎస్ఎల్ఎస్టీ) పరీక్షను పెట్టారు. ఆ పరీక్షల్లో సోమాదాస్ అర్హత సాధించారు. మెరిట్ జాబితాలో ఆమె పేరు ఉన్నప్పటికీ.. దీదీ సర్కార్ ఆమెకు టీచర్ ఉద్యోగం ఇవ్వలేదు. ఇదే అంశంపై సోమాదాస్ న్యాయపోరాటానికి దిగారు. కోల్కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఓ వైపు క్యాన్సర్తో పోరాడుతూనే
ఆమె నియామకంపై హైకోర్టులో కేసు విచారణ, బహిరంగ ఆందోళనలు చేస్తున్న సమయంలో 2019లో ఆమె క్యాన్సర్ బారిన పడ్డారు. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే.. తనకు టీచర్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. అదే సమయంలో సోమాదాస్ ఆవేదనను అప్పటి కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ కీలక తీర్పును వెలువరించారు. సోమాదాస్ను ఉపాధ్యాయురాలిగా నియమించాలని జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి ఆదేశించారు. దీంతో 2022లో దీదీ ప్రభుత్వం సోమాదాస్కు బీర్భూమ్లోని నల్హాటిలో మోధురా జిల్లా పాఠశాలలో నియమించింది. ప్రస్తుతం ఆమె అదే స్కూల్లో విధులు నిర్వహిస్తున్నారు.
సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం
ఈ నేపథ్యంలో 25వేల మంది టీచర్ల నియామకాన్ని రద్దు చేస్తూ అత్యున్నత న్యాయ స్థానం తీసుకున్న నిర్ణయంపై సోమాదాస్ స్పందించారు. సుప్రీం తీర్పు హర్షం వ్యక్తం చేశారు. కానీ తనకు ఆమోద యోగ్యం కాదన్నారు. నేను ఎప్పుడూ ఇతరులు వారి ఉద్యోగాలను కోల్పోవాలని అనుకోను. ఈ తీర్పు నాకు ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే 2016 బ్యాచ్లో చాలా మంది అర్హులు ఉన్నారు. ప్రభుత్వం, స్కూల్ కమిషన్ నిర్లక్ష్యం కారణంగా అర్హులైన వారు ఎంతో మంది ఉద్యోగాలో కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.