
పని గంటలు.. వర్క్కల్చర్ గురించి ఈ మధ్యకాలంలో విపరీతంగా చర్చ నడుస్తోంది. రంగాలకు అతీతంగా ఈ వ్యవహారంపై ప్రముఖులు సైతం స్పందిస్తుండడం చూస్తున్నాం. అయితే.. ఓ సీనియర్ బ్యూరోక్రట్, అందునా LinkedIn లాంటి ప్రొఫెషనల్ వెబ్సైట్లో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్ల పని తీరు గురించి చర్చించుకునేలా చేసింది.
జైపూర్: రాజస్థాన్ సీనియర్ ఐఏఎస్ అధికారి అజితాభ్ శర్మ (Ajitabh Sharma).. ఇటీవల విద్యుత్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన తాజాగా LinkedInలో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఆయన IAS అధికారుల పని విధానంపై కఠినమైన వ్యాఖ్యలు చేశారు.
ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి అజితాభ్ శర్మ ఏమన్నారంటే.. ‘‘మన పని 80 శాతం పైగా నాన్-కోర్ వర్క్(ప్రధాన బాధ్యతలు కాని పనులు) మీదే వెచ్చిస్తున్నాం. అవి.. ఇతర శాఖలతో జరిపే సాధారణ సమావేశాలు, మానవ వనరుల సమస్యలు (HR issues), కేసులు..లీగల్ వ్యవహారాలు, సమాచార హక్కు చట్టం (RTI)కు సమాధానాలు, వార్తా కటింగ్స్.. లేఖలపై సమాధానాలు ఇవ్వడం, ఎన్నో రిపోర్టులు తయారు చేయడం ఇవే ప్రధానంగా ఉన్నాయి. ఒక శాఖ యొక్క నిజమైన కోర్ పని చేయడమే సమాజానికి నిజమైన సేవ..
అయితే.. ప్రతీ IAS పోస్టింగ్ను కష్టమైనదిగా అనుకోవడం తప్పుదారి చూపుతోంది. అలాంటి భావనను నేను ఎప్పుడూ నమ్మను. అధికులు అసలు బాధ్యతలను నిర్వహించాల్సిన సమయం లేక విలువైన పని చేసేందుకు అవకాశం కోల్పోతున్నారు. తద్వారా పాలనా వ్యవస్థ నెట్వర్క్లో కొత్తతరహా ఆలోచనలకు తలుపులు మూసేస్తున్నారు అని అభిప్రాయపడ్డారాయన.
అజితాభ్ శర్మ వ్యాఖ్యలపై నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. ప్రభుత్వ పరిపాలనలో సమర్థత, అధికారుల పనితీరు, శాఖల స్వాతంత్ర్యం వంటి అంశాలపై పలువురు స్పందిస్తున్నారు. ప్రభుత్వం, పాలనా వ్యవస్థలో మార్పు కోరే దిశగా ఒక IAS అధికారే స్పందించిన తీరు.. పరిశీలించదగ్గదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. LinkedInలో తన పోస్టుతో IAS వ్యవస్థలో చెలామణిలో ఉన్న కొన్ని భ్రమలపై అజితాభ్ తీవ్ర విమర్శలు చేశారంటూ మరో యూజర్ కామెంట్ చేశారు.

IAS అధికారులు శాఖానుసారమైన ముఖ్యమైన లక్ష్యాల మీద కాకుండా.. సాధారణ పరిపాలనా ప్రక్రియల్లో బిజీగా ఉంటారని అజితాభ్ ఐఏఎస్ల వర్క్కల్చర్(IAS Work Culture) పోస్టుతో తేటతెల్లమైందని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. ప్రభుత్వ పరిపాలనలో సమర్థత, ఉద్యోగుల స్వయంప్రేరణ, శాఖానుగుణమైన అవగాహన ఎంత అవసరమో గుర్తు చేశాయని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇది పరిపాలనలో నిపుణత, ప్రత్యేకత, వినూత్నతను తగ్గించేలా ఉందని.. ఫలితంగా అధికారుల శక్తి ప్రభావవంతమైన పాలన మీద కాకుండా ‘ఫార్మాలిటీ’గానే మిగిలిపోతోందని మరో యూజర్ విమర్శించారు.
అయితే అజితాభ్ శర్మ మాత్రమే కాదు.. గతంలో కూడా కొంతమంది ఏఏఎస్, ఐపీఎస్ అధికారులు పాలనా వ్యవస్థలో ఉన్న లోపాలు, అధికారుల పని ఒత్తిడి, సమర్థత లోపం వంటి అంశాలపై తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ మహిళా ఐఏఎస్ అరుణా సుందరరాజన్ బ్యూరోక్రసీలో ఉన్న ఫైల్ కల్చర్, కొత్త ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్న దృక్పథం గురించి పలు సందర్భాల్లో మాట్లాడారు. శివానందన్ అనే మాజీ ఐపీఎస్.. అధిక బ్యూరోక్రసీ, ఫీల్డ్ వర్క్కు ప్రాధాన్యత లేకపోవడాన్ని విమర్శించారు. రిటైర్డ్ ఐఏఎస్ అనిల్ స్వరూప్ తన పుస్తకాల్లో(Fear of decision-making is the biggest bottleneck in governance), ఇంటర్వ్యూలలో.. ఫైల్ నిబంధనలు, అనవసరమైన నివేదికలు, అన్నింటికి మించి పాలనా వ్యవస్థలో ఉన్న భయాందోళనలు గురించి స్పష్టంగా చెప్పారు. అయితే..
ప్రస్తుతం సర్వీసులో ఉన్న అజితాభ్ శర్మ లాంటి వ్యక్తి.. సూటిగా అదీ LinkedIn వేదికగా, పైగా గణాంకాలతో (80%) పాలనా సంస్కరణల అవసరాన్ని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం.
అజితాభ్ శర్మ గురించి..
1996 రాజస్తాన్ కేడర్కు చెందిన అజితాభ్ శర్మ.. ఢిల్లీ ఐఐటీలో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చదివారు. భివాడి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అథారిటీ (BIDA)కి ఓఎస్డీగా , జైపూర్ మెట్రో రైల్ కార్పొరేషన్కు చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్గా, ఇన్వెస్ట్మెంట్ & NRI వ్యవహారాలు, BIP, జైపూర్కు ప్రిన్సిపల్ సెక్రటరీ.. ఇలా పాలనా రంగంల అనేక విభాగాల్లో సేవలందించారు. ఈ మధ్యే విద్యుత్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు.