
పూణే: మహారాష్ట్రలోని పూణేలో తాజాగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరిలో మహారాష్ట్ర సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే అల్లుడు డాక్టర్ ప్రాంజల్ ఖేవాల్కర్ కూడా ఉండటం విశేషం. వీరంతా పార్టీలో కొకైన్, గంజాయి సేవించారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటన మరోమారు మహారాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది.
డాక్టర్ ప్రాంజల్ ఖేవాల్కర్, ప్రముఖ రాజకీయ నేత ఏక్నాథ్ ఖడ్సే కుమార్తె, జాతీయవాద మహిళా రాష్ట్ర విభాగం అధ్యక్షురాలు రోహిణి ఖడ్సేను వివాహం చేసుకున్నారు. రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించే రోహిణి.. ప్రాంజల్ను రోండో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట ముక్తాయ్నగర్లో ఉంటోంది. రియల్ ఎస్టేట్, ఈవెంట్ మేనేజ్మెంట్లను నిర్వహిస్తున్న వ్యాపారవేత్తగా ప్రాంజల్ ఖేవాల్కర్ పేరొందారు. చక్కెర, ఇంధన రంగాలకు సంబంధించిన కంపెనీలను నిర్వహిస్తున్నారు. ఒక ట్రావెల్ కంపెనీని కూడా నడుపుతున్నారు. అయితే ప్రాంజల్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
రేవ్ పార్టీలో డాక్టర్ ప్రాంజల్ ఖేవాల్కర్ అరెస్టు అయిన దరిమిలా ఆయనకు సంబంధించిన మునుపటి వివాదాలు ఇప్పుడు వెలికివస్తున్నాయి. గతంలో సామాజిక కార్యకర్త అంజలి దమానియా.. ప్రాంజల్ ఖేవాల్కర్పై పలు ఆరోపణలు చేశారు. ఆయన మహారాష్ట్రలోని జల్గావ్ ఆర్టీఓలో లైట్ మోటార్ వెహికల్ (ఎల్ఎంవీ) కేటగిరీ కింద సోనాటా లిమోజిన్ను నమోదు చేశారని, అది చట్టవిరుద్ధమని ఆమె పేర్కొన్నారు. దేశంలో అంబాసిడర్ లిమోజిన్లకు మాత్రమే చట్టబద్ధంగా అనుమతి ఉందని దమానియా వాదించారు. ఆ కారును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా తాజాగా రేవ్ పార్టీపై దాడి చేసిన పోలీసులు హడప్సర్లోని రోహిణి ఖడ్సే బంగ్లాను కూడా సోదా చేశారు. పార్టీలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ప్రాంజల్ ఖేవాల్కర్ను సస్సూన్ ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.