ఒక విషాద ఘటన.. ఇప్పుడు ఓ పర్యాటక ప్రాంతాన్ని కొత్త కారణంతో వార్తల్లోకి తెచ్చింది. వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. అదే ఘటన జరిగినట్లు ప్రచారంలోకి వచ్చిన మహారాష్ట్రలోని లోహగఢ్ కోటకు ఇప్పుడు పర్యాటకుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా కేతన్ను తోసేశారని చెబుతున్న ప్రదేశాన్ని చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతుండటం చర్చనీయాంశంగా మారింది.
కేతన్ అగర్వాల్ హత్య కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత లోహగఢ్ కోటకు వచ్చే సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు స్థానికులు, టూరిజం వర్గాలు చెబుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం పర్యాటకుల రద్దీ దాదాపు 25 శాతం పెరిగినట్లు సమాచారం. ఈ కేసులో నిందితురాలు సియా అనే యువతి పేరు పదేపదే వినిపించడంతో.. కేతన్ను లోయలోకి తోసేశారని ప్రచారంలోకి వచ్చిన ప్రాంతాన్ని సందర్శకులు ‘సియా పాయింట్’ గా పిలవడం ప్రారంభించారు. అధికారికంగా అలాంటి పేరు లేకపోయినా.. సోషల్ మీడియా ప్రభావంతో ఆ పేరు వేగంగా ప్రాచుర్యం పొందుతోంది.
కోటకు వెళ్లే పర్యాటకులు అక్కడి గైడ్లను, స్థానికులను సియా పాయింట్ ఎక్కడ ఉంది? కేతన్ను తోసింది ఇదే ప్రదేశమా? అంటూ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఆ ప్రాంతంలో ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ధోరణిపై స్థానికులు, పర్యాటక రంగానికి చెందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన లోహగఢ్ కోటను ఒక నేర ఘటనతో గుర్తుపెట్టుకోవడం సరైనది కాదని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన కథనాల ఆధారంగా ప్రచారంలోకి వచ్చిన పేర్లను నిజాలుగా భావించొద్దని కూడా సూచిస్తున్నారు.
మరో వైపు, ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. ఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తున్న కొద్దీ లోహగఢ్ కోట కూడా అనూహ్యంగా దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువుగా మారింది. చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఈ కోట.. ఇప్పుడు ఒక సంచలన హత్య కేసు కారణంగా కొత్త గుర్తింపును సొంతం చేసుకోవడం విశేషం.


