మరీ ఇంత అన్యాయమా?.. కోర్టు మెట్లెక్కిన విజయ్‌ మాల్యా! | Vijay Mallya Petition Karnataka High Court Over Debt | Sakshi
Sakshi News home page

మరీ ఇంత అన్యాయమా?.. కోర్టు మెట్లెక్కిన విజయ్‌ మాల్యా!

Feb 5 2025 7:22 PM | Updated on Feb 5 2025 8:11 PM

Vijay Mallya Petition Karnataka High Court Over Debt

బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పరారైన విజయ్‌ మాల్యా కర్ణాటక కోర్టును ఆశ్రయించారు. తాను వ్యాపార నిమిత్తం భారత్‌లోని పలు బ్యాంకుల్లో చేసిన అప్పు కంటే.. అవి తన వద్ద నుంచి వసూలు చేసిన మొత్తం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందని ఆరోపించారు. కాబట్టి రికవరీ చేసిన మొత్తానికి సంబంధించిన అకౌంట్ స్టేట్‌మెంట్‌ను అందించేలా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని మాల్యా తన పిటిషన్‌లో కోరారు.

బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాలను చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన విజయ్‌ మాల్యా తరుపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఆర్ దేవదాస్ ధర్మాసనం  విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా మాల్యా తరపున సీనియర్ న్యాయవాది సాజన్ పూవయ్య తన వాదనల్ని కోర్టుకు వినిపించారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రూ.6,200 కోట్ల అప్పు చేసిందని.. అందుకు బ్యాంకులు రూ.14,000 కోట్లు రికవరీ చేశాయని అన్నారు.  

ఈ విషయం గురించి లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌ తెలిపారు. మాల్యాకు చెందిన రూ.14, 131 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులు రికవరీ చేశాయని, ఆయన తీసుకున్న రుణంలో దాదాపు రూ.10, 200 కోట్లు చెల్లించినట్లు రికవరీ అధికారి కూడా తెలిపారు. 

కాబట్టి బ్యాంకులు తీసుకునే తదుపరి రికవరీ చర్యలపై తాత్కాలిక స్టే విధించాలని, అన్నీ బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లు అందించాలని మాల్యా కోరారు.

వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ అంశంపై స్పందించాలంటూ ఎస్‌బీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు సహా 10 బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 13లోగా స్పందన తెలియజేయాలంటూ గడువు విధించింది.

Advertisement
 
Advertisement
Advertisement