పార్వతీపురం మన్యం: పట్టుదల, కృషి ఉంటే విజయాలు తప్పకుండా వరిస్తాయని నిరూపించింది నెల్లిమర్ల మండలంలోని మొయిద విజయరాంపురం గ్రామానికి చెందిన యువతి పతివాడ రమాదేవి. పోటీ పరీక్షలకు సిద్ధమైన ఆమె ఒకేసారి మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగావకాశాలు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. విజయనగరం మహారాజా కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసిన రమాదేవి కొంతకాలంగా బ్యాంకింగ్ రంగ ఉద్యోగాలపై దృష్టి సారించి పోటీ పరీక్షలకు సిద్ధమైంది.
ఇటీవల నిర్వహించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు నియామక పరీక్షల్లో పాల్గొని మూడింటిలోనూ అర్హత సాధించింది. మూడు బ్యాంకుల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు రమాదేవి తెలిపింది.
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె అసాధారణ విజయం సాధించడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రమాదేవి తండ్రి వెంకటరమణ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అసిస్టెంట్ సర్వేయర్గా విధులు నిర్వహిస్తుండగా..తల్లి రమణమ్మ గృహిణి..కుమార్తె సాధించిన విజయం తమకు గర్వంగా ఉందని వారు సంతోషం వెలిబుచ్చారు. యువతి రమాదేవి విజయం పట్ల ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సూర్యనారాయణరాజు, గ్రామస్తులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.


