యూజర్‌నేమ్‌ ఫీచర్‌ వివాదం.. నోటీసుల వర్షం | Government Expands Probe Into Username Feature, Issues Notices To Telegram And Signal, More Details Inside | Sakshi
Sakshi News home page

యూజర్‌నేమ్‌ ఫీచర్‌ వివాదం.. నోటీసుల వర్షం

Jul 3 2026 7:39 AM | Updated on Jul 3 2026 9:45 AM

Username Feature Under Fire: Notices to WhatsApp Telegram Signal

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌తో ప్రారంభమైన వివాదం మరో మలుపు తిరిగింది. యూజర్‌నేమ్‌ ఆధారిత కమ్యూనికేషన్‌ ఫీచర్‌ వల్ల భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన చర్యలను మరింత విస్తరించింది. తాజాగా.. టెలిగ్రామ్‌, సిగ్నల్ యాప్‌లకు సైతం కేంద్ర ఐటీ శాఖ (MeitY) నోటీసులు జారీ చేసింది.

యూజర్‌నేమ్‌ వ్యవస్థ వల్ల వ్యక్తుల ఫోన్ నంబర్ అవసరం లేకుండానే ఎవరైనా సంప్రదించగల అవకాశం ఉండటం.. మోసాలకు దారి తీయొచ్చని భారత ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా నకిలీ గుర్తింపులు, సెలబ్రిటీలు లేదా ప్రభుత్వ అధికారుల పేరుతో ఇంపర్సనేషన్‌, ఫిషింగ్ దాడులు పెరిగే ప్రమాదం ఉందనే హెచ్చరికలను ప్రస్తావిస్తోంది. దీనికి తోడు..

ఇటీవలి కాలంలో పెరుగుతున్న “డిజిటల్ అరెస్ట్” మోసాలు, ఆన్‌లైన్‌ ఫ్రాడ్ కేసులు కూడా ఈ ఆందోళనలకు అదనపు కారణాలుగా మారాయి. అందుకే యూజర్‌నేమ్‌ ఫీచర్‌ను ఎలా నియంత్రిస్తున్నారో వివరించాలంటూ అన్ని ప్రధాన మెసేజింగ్ ప్లాట్‌ఫార్మ్‌లను ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.

ఇప్పటికే వాట్సాప్‌లో ప్రతిపాదించిన యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసి, మెటా సంస్థకు నోటీసులు పంపింది. ఆ ఫీచర్‌ను వెంటనే అమలు చేయకూడదని, భద్రతా అంశాలపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పుడు అదే అంశం టెలిగ్రామ్‌, సిగ్నల్ వైపు కూడా విస్తరించడంతో వివాదం మరింత తీవ్రతరమైంది.

టెలిగ్రామ్‌, సిగ్నల్ ఇప్పటికే యూజర్‌నేమ్‌ ఆధారిత వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. దీంతో ఈ ఫీచర్‌ను కొనసాగించడానికి ఉన్న కారణాలు, దానిపై అమలు చేస్తున్న భద్రతా చర్యలపై స్పష్టత ఇవ్వాలని నోటీసుల్లో కేంద్రం పేర్కొంది. టెలిగ్రామ్‌ను మరింత కఠినంగా ప్రశ్నిస్తూ, ఈ ఫీచర్‌ను కొనసాగించాల్సిన అవసరం ఏంటో వివరణ ఇవ్వాలని కూడా కోరింది.

మరోవైపు, వాట్సాప్ యూజర్‌నేమ్‌ ఫీచర్ ఇంకా పూర్తిగా విడుదల కాలేదు. దాని ప్రభావంపై ముందుగానే సమీక్ష జరిపిన కేంద్రం, మెటా సంస్థకు నోటీసులు పంపి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే వాట్సాప్‌ మాత్రం యూజర్‌నేమ్‌ ఫీచర్‌ ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదని.. అది పూర్తి భద్రమైందని.. దాని వల్ల ఎలాంటి నష్టం ఉండదని అంటోంది.

ప్రభుత్వం తీసుకున్న ఈ వరుస చర్యలతో యూజర్‌నేమ్‌ ఫీచర్ చుట్టూ దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. ఒకవైపు వినియోగదారుల ప్రైవసీని పెంచుతుందని వాదనలు వినిపిస్తుండగా, మరోవైపు సైబర్ మోసాలకు దారి తీస్తుందన్న ఆందోళనలు కూడా బలంగా వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement