ఆరోగ్య సేవలన్నీ ఇక డిజిటల్‌ మయం | Union Minister JP Nadda to Launch Aarogya Setu 2. 0 on 29 June 2026 | Sakshi
Sakshi News home page

ఆరోగ్య సేవలన్నీ ఇక డిజిటల్‌ మయం

Jun 28 2026 5:42 AM | Updated on Jun 28 2026 5:42 AM

Union Minister JP Nadda to Launch Aarogya Setu 2. 0 on 29 June 2026

29న ‘ఆరోగ్య సేతు 2.0’, పలు యాప్‌ల ఆవిష్కరణ

లాంఛనంగా ప్రారంభించనున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా

హెల్త్‌ రికార్డుల నుంచి క్లెయిమ్‌ల వరకు అంతా ఆన్‌లైన్‌లోనే

లబ్ధిదారుల కోసం ‘ఆయుష్మాన్‌ సారథి’ వాట్సాప్‌ చాట్‌బాట్‌

సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆరోగ్య రంగంలో సరికొత్త డిజిటల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు పారదర్శకత పెంచే లక్ష్యంతో రూపొందించిన పలు యాప్‌లు, ప్లాట్‌ఫామ్‌లను సోమవారం 29న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏ), నేషనల్‌ రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ ఈహెచ్‌ఆర్‌ స్టాండర్డ్స్‌ (ఎన్‌ఆర్‌సీఈఎస్‌) సంయుక్తంగా ఈ డిజిటల్‌ విధానాలను అభివృద్ధి చేశాయి. డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫర్‌ హెల్త్‌ పరిధిని విస్తరించడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

ఆరోగ్య సేతు 2.0..
కరోనా మహమ్మారి సమయంలో విశేష సేవలందించిన ‘ఆరోగ్య సేతు’యాప్‌ను మరింత ఆధునీకరించి ‘ఆరోగ్య సేతు 2.0’పేరుతో సమగ్ర పర్సనల్‌ హెల్త్‌ రికార్డ్‌ (పీహెచ్‌ఆర్‌) అప్లికేషన్‌గా తీర్చిదిద్దారు. ఆయుష్మాన్‌ భారత్‌(ఆభా) ఖాతా సృష్టి, డిజిటల్‌ హెల్త్‌ రికార్డుల నిర్వహణ, ఏఐ ఆధారిత హెల్త్‌ రిపోర్టులు, స్మార్ట్‌ వాచ్‌ల అనుసంధానం తదితర సేవలను ఇకపై ఒకే ప్లాట్‌ఫామ్‌ ద్వారా పొందవచ్చు. స్కాన్‌ అండ్‌ రిజిస్టర్‌ ద్వారా ఓపీడీ నమోదు, స్కాన్‌ అండ్‌ పే ద్వారా ఆస్పత్రి బిల్లుల చెల్లింపులు, మందుల రిమైండర్లు ఇందులో ఉంటాయి. సమీపంలోని ఆస్పత్రులు, డాక్టర్లు, అంబులెన్స్, బ్లడ్‌ బ్యాంకులు, జన్‌ ఔషధి కేంద్రాల జాబితాతో పాటు పీఎం–జేఏవై నెట్‌వర్క్‌ ఆస్పత్రుల వివరాలు, ఆయుష్మాన్‌ సీఏపీఎఫ్‌ పాలసీ వివరాలను తెలుసుకోవచ్చు.

ఆయుష్మాన్‌ యాప్, సారథి.. 
ఆయుష్మాన్‌ భారత్‌ లబ్ధిదారుల కోసం ఆయుష్మాన్‌ యాప్‌ను అప్‌గ్రేడ్‌ చేశారు. పథకం అర్హత, కార్డు సేవలు, చికిత్స చరిత్ర, ఆస్పత్రుల గుర్తింపు, ఫిర్యాదుల పరిష్కారం లాంటి సేవలను దీని ద్వారా సులభంగా పొందవచ్చు. లబ్ధిదారులకు వాట్సాప్‌ ద్వారా సేవలందించేందుకు ‘ఆయుష్మాన్‌ సారథి’అనే చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీనిద్వారా పథకానికి సంబంధించిన కీలక సేవలను నేరుగా ఫోన్‌ ద్వారానే పొందే వీలు కలుగుతుంది.

సులువుకానున్న బీమా క్లెయిమ్‌లు.. 
ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు నేషనల్‌ హెల్త్‌ క్లెయిమ్స్‌ ఎక్సే్చంజ్‌ను ప్రారంభించనున్నారు. ఆస్పత్రులు, బీమా సంస్థల (ప్రభుత్వ, ప్రైవేటు) మధ్య క్లెయిమ్‌ల సమాచార మార్పిడిని ఇది ప్రమాణీకరిస్తుంది. ఫలితంగా క్లెయిమ్‌ల పరిష్కారంలో జాప్యం తగ్గుతుంది. బీమా ప్లాన్‌లను ప్రామాణిక ‘ఎఫ్‌హెచ్‌ఐఆర్‌ బండిల్స్‌’గా మార్చే నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల తప్పుల్లేకుండా సమాచార నమోదు సాధ్యమవుతుంది.

యూహెచ్‌ఐ, ఈ–సుశ్రుత్‌.. 
రోగులు, వైద్యులను ఒకే నెట్‌వర్క్‌పైకి తెచ్చేందుకు యూనిఫైడ్‌ హెల్త్‌ ఇంటర్‌ఫేస్‌ను ఆవిష్కరించనున్నారు. ఆస్పత్రుల్లో రోగుల రికార్డులు, క్లినికల్‌ విధానాలను డిజిటైజేషన్‌కు ప్లగ్‌–అండ్‌–ప్లే విధానంలో ’ఈ–సుశ్రుత్‌ క్లినిక్‌’ను అందుబాటులోకి తేనున్నారు. ఇది ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ ఎకోసిస్టమ్‌తో అనుసంధానమై పనిచేస్తుంది.

డ్రగ్‌ రిజిస్ట్రీ, క్లినికల్‌ ప్రమాణాలు.. 
మందుల సమాచారాన్ని, కోడింగ్‌ను దేశవ్యాప్తంగా ఏకరూపంలోకి తెచ్చేందుకు ‘డ్రగ్‌ రిజిస్ట్రీ’ని ప్రారంభిస్తున్నారు. ఎన్‌ఆర్‌సీఈఎస్‌ అభివృద్ధి చేసిన ‘కామన్‌ లోయింక్‌ కోడ్స్‌ ఫర్‌ ఇండియా (సీఎల్‌సీఐ)’, ‘భారత్‌ హెల్త్‌ టెర్మినాలజీ సర్వీస్‌ (బీహెచ్‌టీఎస్‌) ’లను ఆవిష్కరించనున్నారు. సీఎల్‌సీఐ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న లేబొరేటరీ నివేదికలను ఒకే ప్రామాణిక విధానంలోకి తీసుకువస్తారు. బీహెచ్‌టీఎస్‌ ద్వారా వైద్య పదజాలాన్ని ప్లాట్‌ఫామ్‌లన్నింటిలో ఏకరూపంలో ఉండేలా చూస్తారు. ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌లో భాగంగా అందుబాటులోకి వస్తున్న ఈ కొత్త విధానాలతో దేశ ఆరోగ్య ముఖచిత్రం మారనుందని, నాణ్యమైన వైద్య సేవలు మరింత సులభంగా, పారదర్శకంగా అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement