
ప్రత్యర్థులకు సవాలు విసిరిన ఉద్ధవ్ ఠాక్రే
అంబులెన్స్ వెంట తెచ్చుకోవాలని సూచన
ముంబై: మహారాష్ట్రలోని శివసేనలో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ శివసేన (ఉద్ధవ్), శివసేన(షిండే)గా చీలిపోయిన సంగతి తెలిసిందే. శుక్రవారం ముంబైలో శివసేన 59వ వ్యవస్థాపక దినోత్సవంలో శివసేన(ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగించారు. ఠాక్రే బ్రాండ్ను ధ్వంసం చేసేందుకు బీజేపీతోపాటు ఏక్నాథ్ షిండే కుట్రలు సాగిస్తున్నారని ఆరోపించారు.
1991లో విడుదలైన ప్రహార్ చిత్రంలోని నానా పటేకర్ డైలాగ్ను గుర్తుచేస్తూ, ‘‘మీకు దమ్ముంటే నన్ను రాజకీయంగా అంతం చేయండి’’అని ప్రత్యర్థులకు సవాలు విసిరారు. కానీ, వెంటనే హాస్యధోరణిలోకి వెళ్లిపోయారు. ‘‘నన్ను చంపడానికి రండి. కానీ, అంబులెన్స్ కూడా వెంట తెచ్చుకోండి. ఎందుకంటే దాని అవసరం మీకే ఉంటుంది’’అని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. మరాఠీ పార్టీల్లో విభేదాలు సృష్టించడానికి బీజేపీ ప్రయతి్నస్తోందని ఆరోపించారు.
ఠాక్రే బ్రాండ్ను ధ్వంసం చేయాలని చూస్తే బీజేపీని ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ఠాక్రే సవాల్పై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శివసేన(షిండే) చీఫ్ ఏక్నాథ్ షిండే స్పందించారు. ఉద్ధవ్ ఠాక్రేను ప్రజలు రాజకీయంగా ఎప్పుడో అంతం చేశారని, కొత్తగా చేయడానికి ఏమీ లేదని పేర్కొన్నారు. సింహం చర్మం కప్పుకున్నంత మాత్రాన తోడేలు ఎప్పటికీ సింహం కాలేదని స్పష్టంచేశారు. ఉద్ధవ్ ఠాక్రే చాలెంజ్పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం స్పందించారు. ఉత్తుత్తి కబుర్లు చెప్పేవారి గురించి మాట్లాడడం తనకు ఇష్టం లేదన్నారు.