ముంబై: తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలు తిరుగుబాటు ప్రకటించడంపై శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్ని సవాళ్లు, అవరోధాలు ఎదురైన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. సుమారు 13 ఏళ్లుగా పార్టీకి సారథ్యం వహిస్తున్నానంటూ ఆయన.. తన హయాంలోనే పార్టీ తీవ్ర సవాళ్లను, వ్యక్తిగత దాడులను ఎదుర్కొందని చెప్పారు. పార్టీ నన్ను వద్దనుకుంటే బాధ్యతల నుంచి వైదొలిగేందుకు సైతం సిద్ధంగా ఉన్నానన్నారు.
నాలుగేళ్లలో రెండుసార్లు పార్టీలో చీలిక రావడంపై ఆయన శుక్రవారం మొదటిసారిగా పైవిధంగా స్పందించారు. శివసేన 60వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఉద్ధవ్ మాట్లాడారు. తనకు నాయకత్వ బాధ్యతల్లో కొనసాగాలన్న కాంక్ష లేదని చెప్పారు. ‘పార్టీకి చెందిన వారు తదుపరి అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తానని ముందుకు వస్తే సంతోషిస్తా. అదే సమయంలో, ద్రోహులు, దొంగలకు పార్టీని అప్పగించబోను’ అని ఆయన పేర్కొన్నారు.
అసలు సినిమా ముందుంది: ఏక్నాథ్ షిండే
అసలు సినిమా ముందుందంటూ శివసేన చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ ఎంసీ ఏక్నాథ్ షిండే పరోక్షంగా ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పులి తోలు కప్పుకున్నంత మాత్రాన తోడేలు పులిగా మారిపోదంటూ ఎద్దేవా చేశారు. ఉద్ధవ్ సారథ్యంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు షిండే పక్షాన చేరారంటూ వస్తున్న వార్తల వేళ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మరోవైపు ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు పార్టీని వీడేందుకు సిద్ధమవడం ఆ వర్గానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఈ పరిణామంతో షిండే వర్గం పార్లమెంటు స్థాయిలో మరింత బలోపేతం అవుతుండగా, ఉద్ధవ్ వర్గం అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మొత్తంగా చూస్తే, 2022లో జరిగిన శివసేన చీలిక తర్వాత మొదటిసారిగా ఉద్ధవ్ వర్గం మరో పెద్ద తిరుగుబాటును ఎదుర్కొంటుండగా, షిండే వర్గం మాత్రం దీనిని తమ రాజకీయ విజయంగా ప్రచారం చేస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.


