
పెరుగనున్న ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు
1850–1900 సగటు కంటే 1.5 డిగ్రీలకుపైగా అధికంగా నమోదయ్యే అవకాశం
2025–2029లో కనీసం ఒక అత్యధిక వేడి సంవత్సరం
ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక
ఆచరణకు దూరంగా పారిస్ వాతావరణ సదస్సు లక్ష్యాలు
న్యూఢిల్లీ/వాషింగ్టన్: కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పుల ధాటికి భూగోళంపై ఉష్ణోగ్రతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. వాతవరణ మార్పులను కట్టడి చేసేందుకు చేపడుతున్న చర్యలేవీ ఆశించిన ఫలితాలిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఉష్ణోగ్రతల పెరుగుదలను పారిశ్రామికవిప్లవం కంటే ముందున్న స్థాయికి తగ్గించాలన్న లక్ష్యాలు నెరవేరడం లేదు.
అభివృద్ధి చెందిన, పారిశ్రామిక దేశాల నిర్వాకం వల్ల ఈ లక్ష్యాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా పరిస్థితి ఇలాగే కొనసాగితే భూగోళం మరింత వేడెక్కడం ఖాయమని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ)తోపాటు యునైటెడ్ కింగ్డమ్ వాతావరణ కార్యాలయం హెచ్చరించాయి. ఈ మేరకు బుధవారం ఒక నివేదిక విడుదల చేశాయి.
ఉష్ణోగ్రతలు పారిశ్రామిక యుగానికి ముందున్న ఉష్ణోగ్రతల కంటే 2025 నుంచి 2029 వరకు ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్కుపైగా అధికంగా నమోదు కావడానికి 70 శాతం అవకాశాలు ఉన్నాయని డబ్ల్యూఎంఓ తేల్చిచెప్పింది.
రాబోయే ఐదేళ్లలో కనీసం ఒక సంవత్సరం అత్యధిక వేడి కలిగిన సంవత్సరంగా రికార్డుకు ఎక్కడానికి 80 శాతం అవకాశాలు ఉన్నట్లు స్పష్టంచేసింది. 2024 సంవత్సరం అత్యధిక వేడి సంవత్సరంగా రికార్డుకెక్కింది. రాబోయే ఐదేళ్లలో ఈ రికార్డు బద్ధలు కానున్నట్లు డబ్ల్యూఎంఓ అంచనా వేసింది. 1850–1900 నాటి సగటు ఉష్ణోగ్రతల కంటే 2024లో 1.5 డిగ్రీలకుపైగా అధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది.
→ ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలని 2015లో జరిగిన పారిస్ వాతావరణ సదస్సులో లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకు ప్రపంచ దేశాలు అంగీకారం తెలిపాయి.
→ 2031–2035కు సంబంధించిన జాతీయ వా తావరణ ప్రణాళికలను దేశాలు ఈ ఏడాది ఐక్యరాజ్యసమితికి సమరి్పంచాల్సి ఉంది.
→ 1850–1900 నాటి సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2025 నుంచి 2029 దాకా ప్రపంచ ఉపరితల సగటు ఉష్ణోగ్రతలు ప్రతిఏటా 1.2 డిగ్రీల నుంచి 1.9 డిగ్రీల చొప్పున పెరుగుతాయని డబ్ల్యూఎంఓ నివేదిక తెలియజేసింది.
→ 1850–1900 నాటి సగటు ఉష్ణోగ్రతల కంటే 2025 నుంచి 2029లో కనీసం ఒక సంవత్సరంలో ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్(2.7 డిగ్రీల ఫారెన్హీట్) అధికంగా నమోదయ్యే అవకాశం 86 శాతం ఉన్నట్లు పేర్కొంది.
→ ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఎన్నెన్నో ప్రతికూల ప్రభావాలు ఉంటాయని డబ్ల్యూఎంఓ డిప్యూటీ సెక్రెటరీ జనరల్ కో బారెట్ చెప్పారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయని, రోజువారి జీవితాలకు, పర్యావరణానికి విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
→ ప్రపంచంలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఆర్కిటిక్ ప్రాంతం వేగంగా వేడెక్కే ప్రమాదం కనిపిస్తోంది. రాబోయే ఐదేళ్లలో ఇక్కడ మంచు చాలావరకు కరిగిపోతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
→ దక్షిణాసియాలో 2023లో మినహా గత కొన్నేళ్లలో మంచి వర్షాలే కురిశాయి. ఇక్కడ 2025 నుంచి 2029 దాకా సాధారణ కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నట్లు ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. కొన్ని సీజన్లలో మాత్రం వర్షాలు పడకపోవచ్చని తెలియజేసింది.
→ ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పెరగడం వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులకు, తుపాన్లు, కరువులకు దారి తీస్తుందని కార్నెట్ యూనివర్సిటీకి చెందిన వాతావరణ శాస్త్రవేత్త నటాలీ మహొవాల్డ్ చెప్పారు. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ భూమిపై మనుషులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతుంటారని స్పష్టంచేశారు.