ముంబై ఉగ్రదాడి: తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణాకు 18 రోజుల ఎన్‌ఐఏ కస్టడీ | 26/11 Mumbai Taj Hotel Incident Accused Tahawwur Rana Sent To NIA Custody For 18 Days, Watch News Video Inside | Sakshi
Sakshi News home page

Tahawwur Rana: తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణాకు 18 రోజుల ఎన్‌ఐఏ కస్టడీ

Apr 11 2025 7:32 AM | Updated on Apr 11 2025 10:16 AM

Tahawwur Rana Sent To NIA Custody For 18 Days

ఢిల్లీ: ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణాను 18 రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. గురువారం అర్ధరాత్రి ఎన్‌ఐఏ అధికారులు ఢిల్లీలోని పాటియాలా హౌస్‌ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఎన్‌ఐఏ కార్యాలయం, పాటియాలా హౌస్‌ కోర్టు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.

వివరాల ప్రకారం.. ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి చందర్‌జిత్‌ సింగ్‌ ఎదుట ఎన్‌ఐఏ అధికారులు హాజరుపర్చారు. ఎన్‌ఐఏ తరఫున సీనియర్‌ అడ్వొకేట్లు నరేందర్‌ మాన్, దయాన్‌ కృష్ణన్, రాణా తరఫున ఢిల్లీ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ అడ్వొకేట్‌ పీయూష్‌ సచ్‌దేవా వాదనలు వినిపించారు. పోలీసులు కోర్టు గదిలోకి ఇతరులను అనుమతించలేదు. మీడియా ప్రతినిధులను సైతం బయటకు పంపించారు. ముంబై దాడుల కేసులో విచారణ నిమిత్తం రాణాను 20 రోజులపాటు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించాలని దయాన్‌ కృష్ణన్‌ కోరగా, 18 రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. అర్ధరాత్రి వరకూ కోర్టులో వాదనలు కొనసాగాయి. ఉగ్రవాద దాడుల్లో రాణా పాత్రకు సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు కృష్ణన్‌ సమర్పించారు.  ఈ సందర్భంగా ఎన్‌ఐఏ కార్యాలయం, పటియాలా హౌస్‌ కోర్టు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.  

కాగా, ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణాను ఎట్టకేలకు ఇండియాకు తీసుకొచ్చారు. భారత దర్యాప్తు అధికారులు అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. బుధవారం సాయంత్రం అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌ నుంచి బయలుదేరిన విమానం గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యింది. విమానం నుంచి బయటకు రాగానే రాణాను ఎన్‌ఏఐ బృందం అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టుకు తరలించారు.  

అతిపెద్ద దౌత్య విజయం  
భారత్‌కు అప్పగించవద్దని, అక్కడ తనకు రక్షణ ఉండదని మొండికేస్తూ అమెరికా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ 15 ఏళ్లు కాలక్షేపం చేసిన తహవ్వుర్‌ రాణా ఆశలు నెరవేరలేదు. అతడి అప్పగింత ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగించింది. కొన్ని రోజులు క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ తర్వాత రాణా అప్పగింత ప్రక్రియ చకచకా పూర్తయ్యింది.

2008 నాటి ఉగ్రవాద దాడుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టులో రాణాపై ఇక విచారణ ప్రారంభం కానుంది. నేరపూరిత కుట్ర, భారతదేశంపై యుద్ధం ప్రకటించడం, హత్యతోపాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద రాణాపై అభియోగాలు నమోదయ్యాయి. అతడిని అమెరికా నుంచి భారత్‌కు రప్పించడం అతిపెద్ద దౌత్య, న్యాయపరమైన విజయంగా భావిస్తున్నారు. 26/11 దాడుల్లో మృతిచెందినవారికి, బాధితులకు న్యాయం చేకూర్చడంలో రాణా అప్పగింత ఒక కీలకమైన ముందుడుగు అని అమెరికా న్యాయ శాఖ గురువారం వెల్లడించింది.    

ముంబైలో ఆ రోజు ఏం జరిగింది?  
2008 నవంబర్‌ 26న పాకిస్తాన్‌కు చెందిన 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించారు. నవంబర్‌ 26 నుంచి 29 దాకా.. నాలుగు రోజులపాటు వేర్వేరు చోట్ల తుపాకులు, గ్రెనేడ్లతో చెలరేగిపోతూ నెత్తుటేర్లు పారించారు. ఛత్రపతి శివాజీ టెరి్మనస్, ఒబెరియ్‌ ట్రిడెంట్‌ హోటల్, తాజ్‌మహల్‌ ప్యాలెస్‌ హోటల్, లియోపోల్డ్‌ కేఫ్, కామా హాస్పిటల్, నారిమన్‌ హౌస్, మెట్రో సినిమా హాల్‌ తదితర ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు.

ఆరుగురు అమెరికా పౌరులు సహా 166 మంది మృతిచెందారు. 300 మంది క్షతగాత్రులుగా మారారు. భద్రతా సిబ్బంది కాల్పుల్లో 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అజ్మల్‌ కసబ్‌ ఒక్కడే సజీవంగా దొరికిపోయాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతడికి ఉరిశిక్ష అమలు చేశారు. ముంబైలో ఉగ్రవాద దాడులకు రాణా  సహాయ సహకారాలు అందించినట్లు ఎన్‌ఏఐ చెబుతోంది. 2009లో ఎఫ్‌బీఐ రాణాను అరెస్టు చేసింది. లాస్‌ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్‌ డిటెన్షన్‌ సెంటర్‌లో నిర్బంధించింది.  

ఎవరీ రాణా?  
పాకిస్తాన్‌లో ధనవంతుల కుటుంబంలో 1961 జనవరి 12న జన్మించిన తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణా చివరకు ఉగ్రబాట పట్టాడు. ఇస్లామాబాద్‌లో పెరిగిన రాణా హసన్‌ అబ్దల్‌ కేడెట్‌ కాలేజీలో చదువుకున్నాడు. అక్కడే డేవిడ్‌ కోలోమన్‌ హెడ్లీ అలియాస్‌ దావూద్‌ గిలానీతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహిత మిత్రులయ్యారు. వైద్య విద్య అభ్యసించిన రాణా పాకిస్తాన్‌ సైన్యంలో డాక్టర్‌గా పనిచేశాడు. 1997లో మేజర్‌ హోదాలో పదవీ విరమణ పొందాడు. తర్వాత కెనడాకు చేరుకున్నాడు. ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించే కంపెనీ స్థాపించాడు. కెనడా పౌరసత్వం సంపాదించాడు.

అనంతరం అమెరికాలోని షికాగోకు మకాం మార్చాడు. ఇమ్మిగ్రేషన్, వీసా ఏజెన్సీ ప్రారంభించాడు. హలాల్‌ మాంసం విక్రయించే వ్యాపారం చేశాడు. హెడ్లీ సూచన మేరకు రాణా ముంబైలో ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయం ఏర్పాటు చేశాడు. 2006 నుంచి 2008 దాకా హెడ్లీ ఈ ఆఫీసుకు ఐదుసార్లు వచ్చి వెళ్లాడు. ముంబైలో ఎక్కడెక్కడ దాడులు చేయాలో నిర్ణయించుకున్నాడు. 26/11 దాడులకు రాణా ఆఫీసును ఉగ్రవాదులు ఒక అడ్డాగా వాడుకున్నారు. ఆరుగురు ప్రధాన కుట్రదారుల్లో రాణా కూడా ఉన్నాడు. అయితే, హెడ్లీ అప్రూవర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం అమెరికాలో కస్టడీలో ఉన్నాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement