సాక్షి, విజయవాడ: విజయవాడ టెర్రర్ లింకుల కేసును తమకు అప్పగించాలని విజయవాడ పోలీసు కమిషనర్కు ఎన్ఐఏ(NIA) అధికారులు లేఖ రాశారు. ఏడు రాష్ట్రాలకు ముడిపడి ఉన్న కేసు కావడంతో తమకు అప్పగించాలని ఎన్ఐఏ అధికారులు లేఖలో పేర్కొన్నారు. ఉగ్ర లింకుల కేసులో ఇప్పటివరకు 13 మందిపై కేసు నమోదు చేశారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని కొత్తపేట పోలీసులతో పాటు, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. నిందితుల కస్టడీ పూర్తయ్యాక ఎన్ఐఏకి అప్పగించే అవకాశం ఉంది.
కాగా, బెజవాడ ‘ఉగ్ర’ లింకులు దేశవ్యాప్తంగా విస్తరించినట్టు గుర్తించిన పోలీసులు వారి కోసం వేట మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్లోని హ్యాండ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు సమాచారం అందుకున్న కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు, విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. విజయవాడలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన మహమ్మద్ రహ్మతుల్లా షరీఫ్, మహమ్మద్ దానిష్, మీర్జా సోహైల్తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు.


