శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో వేర్పాటువాద కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారంతో, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఘైఏ)రంగంలోకి దిగింది. సోమవారం ఉదయం నుండి సెంట్రల్, సౌత్ కశ్మీర్లోని పలు కీలక ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి, అనుమానిత స్థావరాలను జల్లెడ పట్టారు.
నిషేధిత సంస్థల కేంద్రాలపై ఆకస్మిక దాడి
షోపియాన్ జిల్లాలోని ఇమామ్ సాహిబ్ ప్రాంతంలో ఉన్న ‘దారుల్ ఉలూమ్ సిరాజుల్ ఉలూమ్’ను ఎన్ఐఏ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. గత నెలలోనే ఈ విద్యాసంస్థను చట్టవిరుద్ధమైనదిగా ప్రభుత్వం ప్రకటించింది. వందలాది మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్న ఈ కేంద్రంపై దాడులు నిర్వహించడం స్థానికంగా సంచలనం రేపింది. అదే సమయంలో, నిషేధిత జమాయత్-ఎ-ఇస్లామీ మాజీ చీఫ్ షాజాదా ఔరంగజేబ్ నివాసంలో కూడా అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు.
మళ్లీ మొదలైన వేర్పాటువాద కుట్రలు?
జమాయత్-ఎ-ఇస్లామీని తిరిగి క్రియాశీలకం చేసేందుకు, తద్వారా కశ్మీర్లో భారత్కు వ్యతిరేక కథనాలను ప్రచారం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్ఐఏ వర్గాలు భావిస్తున్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారన్న పక్కా సమాచారంతో, ఈ సంస్థతో సంబంధం ఉన్న పలు అనుమానిత ప్రదేశాలను అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఐదేళ్లుగా కొనసాగుతున్న నిషేధం
భారత దేశ సమగ్రతకు, భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న జమాయత్-ఎ-ఇస్లామీపై కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2024లో ‘ఉపా’చట్టం కింద నిషేధాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించింది. 2019లో మొదటిసారి నిషేధానికి గురైన ఈ సంస్థ, ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు కలిగి ఉంటూ, వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తోందని హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశ వ్యతిరేక శక్తులపై ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు కశ్మీర్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇది కూడా చదవండి: అమెరికా: కెథడ్రల్ రాక్పై దాడి.. దుండగుల కోసం గాలింపు


