
న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానంలోని జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పంజాబ్ యూట్యూబర్ అజయ్ శుక్లాపై సుప్రీంకోర్టు మండిపడింది. సుప్రీం జడ్జీలపై అతడు చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా, ప్రతిష్టకు భంగం కలిగించేలా, ధిక్కార పూరితంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. సుమోటోగా అతడిపై ధిక్కార చర్యలు చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ల ధర్మాసనం శుక్రవారం..తక్షణమే శుక్లా వ్యాఖ్యలున్న వీడియోను తొలగించాలని, మరోసారి అదే వీడియోను కానీ, అలాంటి వీడియోను కానీ ప్రసారం చేయరాదంటూ అతడి వరప్రద్ మీడియా చానల్ను ఆదేశించింది.
శుక్లా వ్యాఖ్యలు తీవ్రమైనవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రం, పత్రికా స్వేచ్ఛకు కొన్ని పరిమితులున్నాయని ధర్మాసనం తెలిపింది. ఈ స్వేచ్ఛను అడ్డుపెట్టుకుని సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. శుక్లాపై ధిక్కారం కేసు నమోదు చేయాలని ఆదేశించింది. రిటైర్డు జస్టిస్ బేలా ఎం త్రివేదిపై వ్యాఖ్యలతో కూడిన వీడియోను శుక్లా తన యూట్యూబ్ చానల్లో ఇటీవల అప్లోడ్ చేశాడు.