
‘థగ్ లైఫ్’ విడుదల ఆపడంపై సుప్రీం వ్యాఖ్య
థియేటర్ల వద్ద భద్రత కల్పిస్తామని కర్ణాటక సర్కారు హామీ
న్యూఢిల్లీ: కమల్ హాసన్ స్టారర్ ‘థగ్ లైఫ్’సినిమా విడుదలను అడ్డుకునే వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయనే కారణంతో సినిమా, స్టాండప్ కామెడీ లేదా కవితా గోష్టి వంటి వాటిని ఆపలేమని స్పష్టం చేసింది. ‘మన దేశంలో మనోభావాలను దెబ్బతీసే ఘటనలకు ముగింపు కనిపించడం లేదు. స్టాండప్ కమెడియన్ ఏదో అంటే మనోభావాలు దెబ్బతిన్నాయని, విధ్వంసం, నిరసనలకు దిగుతున్నారు.
ఎటు వెళ్తున్నాం మనం? ఏంటి దీనర్థం? నిరసనలు చేపట్టారనే కారణంతో సినిమా, స్టాండప్ కామెడీ షో, కవితా గోష్టి వంటి వాటిని ఆపేయాలా?’అంటూ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది. కమల్ హాసన్ వ్యాఖ్యల నేపథ్యంలో విడుదల ఆగిన ‘థగ్ లైఫ్’ను కర్ణాటకలో ప్రదర్శించేందుకు ఆదేశాలివ్వాలంటూ మహేశ్ రెడ్డి వేసిన పిల్పై గురువారం ధర్మాసనం విచారణ చేపట్టింది.
రాష్ట్రంలోని థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శన సమయంలో తగు భద్రత కల్పిస్తామంటూ కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన హామీకి ధర్మాసనం అంగీకరించింది. ఏ వ్యక్తి గానీ, సమూహం గానీ సినిమా ప్రదర్శనకు అవరోధం కల్పించినా, నష్టపరిచినా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయానికి ఇంతటితో ముగింపు పలుకుతున్నామంది.
తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలంటూ కమల్ హాసన్ను కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్(కేఎఫ్సీసీ) కోరడంపై ధర్మాసనం..‘దీనికి మేం అస్సలు అంగీకరించం. ఒక అభిప్రాయం కారణంగా సినిమాను అడ్డుకుంటారా? స్టాండప్ కామెడీని, కవితా పఠాన్ని ఆపేస్తారా?’అని ప్రశ్నించింది. అయితే, తమకు కొన్ని సమూహాల నుంచి బెదిరింపులు వచ్చినందునే కమల్ను క్షమాపణ చెప్పాలని ఒక లేఖ ద్వారానే కోరామని, అంతే తప్ప కమల్ను బెదిరించలేదని కేఎఫ్సీసీ వివరించింది.
బెదిరింపుల విషయాన్ని పోలీసుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని కేఎఫ్సీసీని ధర్మాసనం ప్రశ్నించింది. సినిమా విడుదల చేస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ వచ్చిన బెదిరింపుల విషయం తెలపగా కేఎఫ్సీసీ స్పందించలేదని మహేశ్ రెడ్డి తర ఫు లాయర్ తెలిపారు. బెదిరించిన వారిపై చర్యలు తప్పక తీసుకుంటామని రాష్ట్ర ప్రభు త్వ లాయర్ హామీ ఇచ్చారు. కన్నడ సాహిత్య పరిషత్ తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ నూలి వాదనలు వినిపించారు. కమల్ వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలో కన్నడిగుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.
కమల్ క్షమాపణ చెబితేనే రాష్ట్రంలో ఆ సినిమా ప్రదర్శన వీలవుతుందని, లేకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘అంటే..థగ్ లైఫ్ అనధికార బ్యాన్ను, థియేటర్లను బుగ్గిపాలు చేసేందుకు మీరు మద్దతిస్తున్నారా?’అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘క్షమాపణ చెప్పడం ఏమిటి? చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోలేరు. మనోభావాలు గాయపడితే పరువునష్టం కేసు వేయండి..!’అని ధర్మాసనం పేర్కొంది. హింసకు పాల్పడే వారిని తాము ప్రోత్సహించమంటూ కన్నడ సంస్థ తరఫు లాయర్ పేర్కొనగా ‘సినిమా విడుదలను కూడా మీరు అడ్డుకోరాదు’అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.