హొసపేటె: ఉత్తరాఖండ్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరైన ఒక సమావేశ వేదిక స్థలాన్ని అపవిత్రమైందంటూ బీజేపీ, సంఘ పరివార్ కార్యకర్తలు గంగా జలంతో శుభ్రం చేసిన ఘటనను ఖండిస్తూ మంగళవారం నగరంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ భారీ నిరసన చేపట్టింది. నగరంలోని అంబేడ్కర్ కూడలి వద్ద వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు గుమిగూడి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేతలు రామకృష్ణ, సోమశేఖర్, రవికుమార్ తదితరులు మాట్లాడుతూ ఈ ఘటనతో బీజేపీ కులతత్వ, సంకుచిత మనస్తత్వం స్పష్టమవుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటరానితనాన్ని పాటిస్తున్న వారందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పార్టీ నేతలు అల్లాబక్షి, వెంకటరమణ, సన్న ఈరప్ప, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


