బళ్లారిఅర్బన్: బళ్లారి వైద్య కళాశాల పరిశోధన సంస్థ(బీఎంసీఆర్సీ) డైరెక్టర్ డాక్టర్ గంగాధర్ గౌడను తొలగించి అర్హత, అనుభవం ఉన్న వైద్యాధికారిని నియమించాలని జయ కర్ణాటక రక్షణ వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు వేదిక కార్యకర్తలు మంగళవారం జిల్లాధికారి కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. వేదిక వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్ సుందర్, జిల్లా అధ్యక్షుడు కేపీ.హసేన్ నేతృత్వంలో ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. డైరెక్టర్ నాలుగేళ్ల పదవి కాలంలో బీఎంసీఆర్సీలో పరిపాలన సమస్యలు, రోగులకు ఇబ్బందికర ఘటనలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. ఆక్సిజన్ కొరత, మందులు, భవన నిర్మాణం, ఫర్నిచర్, విద్యుత్ పరికరాల కొనుగోళ్లలో టెండర్ నిబంధనల ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కోరారు. బీఎంసీఆర్సీలో ఉన్న అనుభవజ్ఞులైన వైద్యాధికారికి డైరెక్టర్ పదవిని అప్పగించి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హగరి గురు, ఏ.కుమారస్వామి, చాంద్బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


