16 గంటలు శ్రమించినా దక్కని ప్రాణం.. బోరుబావిలో పడిన సుమిత్‌ మృతి | SUMIT MEENA who fell into borewell Guna dies | Sakshi
Sakshi News home page

16 గంటలు శ్రమించినా దక్కని ప్రాణం.. బోరుబావిలో పడిన సుమిత్‌ మృతి

Dec 29 2024 7:51 PM | Updated on Dec 29 2024 7:52 PM

SUMIT MEENA who fell into borewell Guna dies

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ రాష్ట్రం గుణ జిల్లాలో బోరు బావి ఘటనలో బాలుడు సుమిత్‌ మీనా (Sumit Meena) విషాదాంతమైంది. శనివారం సాయంత్రం బోరు బావిలో పడిన 10ఏళ్ల బాలుడు సుమిత్‌ మీనాను రెస్యూ సిబ్బంది రక్షించారు. అయితే, చికిత్స పొందుతూ మరణించడంతో బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

గుణ జిల్లా (Guna District) రఘోఘర్ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని పిప్లియా అనే గ్రామంలో శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో సుమిత్ మీనా అనే బాలుడు ఆటలాడుకుంటూ 140 అడుగుల బోరుబావిలో పడ్డాడు. 39 అడుగుల లోతులోకి కూరుకుపోయాడు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు,రెస్క్యూ సిబ్బంది బాలుడిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. 16 గంటల పాటు శ్రమించి సుమిత్‌ మీనాను బోరుబావి (borewell) నుంచి  సురక్షితంగా బయటకు తీశాయి. ఆదివారం ఉదయం 9.30గంటల సమయంలో అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాయి. అయినప్పటికీ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు గుణ జిల్లా వైద్యాదికారి డాక్టర్‌ రాజ్‌కుమార్‌ రిషేశ్వర్‌ తెలిపారు.

 

‘బాలుడు రాత్రంతా చలి వాతావరణంలో బోర్‌వెల్‌లోనే ఉన్నాడు. అతని చేతులు, కాళ్ళు తడిసి వాచిపోయాయి.నోట్లోకి బురద చేరింది.మోతాదుకు మించి (అల్పోష్ణస్థితి) నీరు చేరడం వల్ల బాలుడి అంతర్గత భాగాల పనితీరు స్తంభించి పోయింది. సకాలంలో మెరుగైన వైద్యం అందించినా సమయం మించిపోయినందున  బాలుడిని కాపాడుకోలేకపోయాం’అని విచారం వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement