పట్టాలపై ఇసుక పోసి.. రైలు ప్రమాదానికి మరో కుట్ర | Soil Dumped On Railway Tracks In UP Raebareli, Loco Pilot Stops Train | Sakshi
Sakshi News home page

పట్టాలపై ఇసుక పోసి.. రైలు ప్రమాదానికి మరో కుట్ర

Oct 7 2024 7:22 AM | Updated on Oct 7 2024 8:43 AM

Soil Dumped on Tracks in Raebareli

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రైళ్లను పట్టాలు తప్పించేందుకు జరుగుతున్న కుట్రలు ఆగడంలేదు. తాజాగా ఇటువంటి ఘటన రాయ్‌బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. ఖీరూన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘురాజ్ సింగ్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఇసుక కుప్పను చూసిన ప్యాసింజర్ రైలు లోకో పైలట్ వెంటనే రైలును ఆపాడు. ఈ ఘటనను పోలీసులు ధృవీకరించారు.

ఖీరోన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌హెచ్‌ఓ) దేవేంద్ర భడోరియా మాట్లాడుతూ డంపర్ నుండి రైల్వే ట్రాక్‌పై ఇసుక పోశారని, దానిని తొలగించిన తరువాత రైలు ముందుకు సాగిందన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. స్థానికంగా రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, దీనిలోభాగంగా మట్టిని రవాణా చేసే పని రాత్రిపూట జరుగుతున్నదన్నారు. ఈ నేపధ్యంలోనే ఓ డ్రైవర్ డంపర్ నుంచి ఇసుకను రైల్వే ట్రాక్‌పై పోసి  అక్కడినుంచి పరారయ్యాడన్నారు. ఇది జరిగిన కొద్దిసేపటి తర్వాత రాయ్ బరేలీ- రఘురాజ్ సింగ్ స్టేషన్ మధ్య నడుస్తున్న షటిల్ రైలు  ఈ రూట్‌లో వచ్చిందన్నారు.  

అయితే ఆ రైలు లోకో పైలట్ రైల్వే ట్రాక్‌పై మట్టిని గమనించి, రైలును ఆపాడని దేవేంద్ర భడోరియా తెలిపారు. లోకో పైలట్  అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని, రైల్వే ట్రాక్‌పై మట్టిని తొలగించిన తర్వాత రైలు నెమ్మదిగా ముందుకు కదిలిందన్నారు. ఈ సమయంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గేట్‌మెన్ శివేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ  రైలు వేగం తక్కువగా ఉన్నకారణంగానే ప్రమాదం తప్పిందని, ఒకవేళ వేగం ఎక్కువగా ఉంటే రైలు పట్టాలు తప్పేదన్నారు. పోలీసులు ఈ ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఎయిర్‌పోర్టు వెలుపల పేలుడు.. ఇద్దరు మృతి

Advertisement
 
Advertisement
Advertisement