నేడు అమేథీలో స్మృతి ఇరానీ నామినేషన్‌ | Smriti Irani Nomination From Amethi | Sakshi
Sakshi News home page

Lok Sabha Election-2024: నేడు అమేథీలో స్మృతి ఇరానీ నామినేషన్‌

Apr 28 2024 9:33 AM | Updated on Apr 28 2024 9:33 AM

Smriti Irani Nomination From Amethi

ఈరోజు (ఆదివారం) భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మహిళా నేత స్మృతి ఇరానీ యూపీలోని అమేథీ లోక్‌సభ స్థానానికి తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ముందు ఆమె అయోధ్యలోని రామ్‌లల్లాను దర్శించుకోనున్నారు. అనంతరం ఆమె తన లోక్‌సభ నియోజకవర్గానికి వెళ్లి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయనున్నారు. మే 20న అమేథీలో ఐదో దశలో ఓటింగ్ జరగనుంది. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం (ఏప్రిల్ 26) ప్రారంభమైంది. ఐదో దశలో మొత్తం 49 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

అమేథీలో నామినేషన్‌కు చివరి తేదీ మే 3. దీంతో కాంగ్రెస్‌కు ఈ సీటు నుంచి పోటీచేయబోయే అభ్యర్థిని ప్రకటించడానికి ఎక్కువ సమయం లేదు. కాంగ్రెస్ పార్టీ అమేథీలో తన అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదు. అయితే రాహుల్ గాంధీ ఈ స్థానం నుండి మరోసారి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమేథీ నియోజకవర్గం చాలాకాలంపాటు గాంధీ కుటుంబం ఆధీనంలో ఉంది. అయితే 2019లో రాహుల్‌ను ఓడించడం ద్వారా స్మృతి ఇరానీ ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యానికి స్వస్తి పలికారు. అయితే ఇప్పుడు స్మృతిని ఓడించి, కాంగ్రెస్ కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందేందుకు రాహుల్ ప్రయత్నించనున్నారని సమాచారం.

అమేథీతో పాటు రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి కూడా ఇప్పటివరకు కాంగ్రెస్‌ ఎవరికీ టిక్కెట్‌ కేటాయించలేదు. ఈ సీటు కూడా కాంగ్రెస్ సంప్రదాయ సీటు. 2019లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే. సోనియాగాంధీ ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు  ఆమె ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటు నుంచి సోనియా కుమార్తె  ప్రియాంక ఎన్నికల బరిలో దిగవచ్చని తెలుస్తోంది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తున్నప్పటికీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement