ఆంధ్రా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు
నెలరోజులుగా అంకం రాహుల్ తల్లి ఆవేదన
కోరుట్ల: ‘నెల రోజులు గడిచిపోతోంది.. నా కొడుకును ఎవరైనా చంపారా? ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయం ఆంధ్రా పోలీసులు తేల్చడం లేదు.. తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.. కనీసం నా కొడుకు శవమైనా ఇప్పించండి.. లేకుంటే తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేస్తా’అని తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన తల్లి అంకం వనిత కన్నీరుమున్నీరవుతోంది. వనిత –రాజేశ్వర్ దంపతుల కుమారుడు రాహుల్ హైదరాబాద్లో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.మే 27న టూర్ వెళ్తున్నానని ఇంటికి ఫోన్చేసి చెప్పాడు.
కాచిగూడ రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్ నుంచి శబరి వెళ్లే ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్లినట్లు సీసీ ఫుటేజీల్లో కనిపించాడు. మే 30న ఒంగోలు జిల్లా సింగరాయకొండ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ బావిలో బండకట్టి ఉన్న రాహుల్ మృతదేహం లభించడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోలీసులు.. రాహుల్ మృతిపై ఎక్కడా లేని ఉదాసీనత చూపినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు.
రాహుల్ మృతి మిస్టరీ ఛేదించాలని విద్యార్థి, కుల సంఘాల ఆందోళనలు నిర్వహించాయి. దీంతో మృతదేహాన్ని పాతిపెట్టిన పోలీసులు.. మళ్లీ విచారణకు ఉపక్రమించారు. పాతిపెట్టిన సమయంలో తొడఎముకను భద్రపరిచిన పోలీసులు డీఎన్ఏ టెస్టుకు పంపించారు. వారం క్రితం డీఎన్ఏ టెస్టు తల్లిదండ్రులతో సరిపోయినట్లు తేలడంతో శుక్రవారం రాహుల్ మృతదేహం అప్పగిస్తామని చెప్పారు. తల్లిదండ్రులు అక్కడికి వెళ్లగా.. మరోరెండు రోజుల వరకు ఆగాలని పోలీసులు చెప్పడం గమనార్హం.


