
ఐఎస్ఎస్లోకి ప్రవేశించగానే తోటి వ్యోమగాముల సమక్షంలో ప్రసంగిస్తున్న శుభాన్షు శుక్లా
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మన తొలి ముద్ర
తొలి భారతీయునిగా వాయుసేన పైలట్ రికార్డ్
గగన్యాన్ దిశగా కీలక ముందడుగు
భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణాధ్యాయం
28 గంటల అనంతరం ఐఎస్ఎస్తో యాగ్జియం–4 అనుసంధానం
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణాధ్యాయానికి తెరలేచింది. మానవసహిత అంతరిక్ష యాత్ర దిశగా భారీ ముందడుగు పడింది. 140 కోట్ల పై చిలుకు బారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ నిన్న రోదసిలోకి దూసుకెళ్లి, ఆ ఘనత సాధించిన రెండో భారతీయునిగా నిలిచిన మన వాయుసేనాని గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా (39) నేడు మరోచరిత్ర లిఖించారు. గురువారం సాయంత్రం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి విజయవంతంగా ప్రవేశించారు.
ఆ ఘనత సాధించిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. శుభాన్షుతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు ఇస్రో, నాసా సంయుక్త వాణిజ్య మిషన్ యాగ్జియం–4లో భాగంగా స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ ద్వారా బుధవారం విజయవంతంగా నింగికెగిసిన విషయం తెలిసిందే. 28 గంటల పాటు భూ కక్ష్యలో పరిభ్రమించిన అనంతరం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల 1 నిమిషానికి అది భూమి నుంచి 418 కి.మీ.ల ఎత్తున ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది.
తర్వాత రెండు గంటల పాటు తప్పనిసరి తనిఖీలు, ఐఎస్ఎస్తో డ్రాగన్ అనుసంధాన (డాకింగ్) ప్రక్రియ కొనసాగాయి. 12 జతల హుక్కులతో పరస్పరం అనుసంధానమయ్యాయి. తర్వాత డ్రాగన్, ఐఎస్ఎస్ నడుమ సమాచార, ఇంధన లింకేజీ తదితర సంబంధాలు నెలకొన్నాయి. అంతా సజావుగా జరిగిపోయిందని నిర్ధారించుకున్నాక సాయంత్రం 5.44 గంటలకు ఐఎస్ఎస్ మూత తెరుచుకుని తొలుత మిషన్ కమాండర్ పెగ్గీ వాట్సన్ (అమెరికా), ఆ వెనకే శుభాన్షు ఐఎస్ఎస్లోకి ప్రవేశించారు.
అనంతరం ఉజ్నాన్స్కీ విస్నేవ్స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) వారిని అనుసరించారు. ఐఎస్ఎస్లోని ఏడుగురు వ్యోమగాములు వారికి చప్పట్ల నడుమ హార్దిక స్వాగతం పలికారు. వెల్కం డ్రింక్గా మంచినీళిచ్చి సేదదీర్చారు. శుభాన్షు బృందం ఆనంద హేలను కెమెరాల్లో బంధించి భద్రపరిచారు. అనంతరం పరస్పర ఆలింగనాలు, హై–ఫైవ్లు, క్షేమ సమాచారాలు తదితరాలతో ఐఎస్ఎస్ సందడిగా మారింది. శుభాన్షు బృందం 14 రోజులపాటు అక్కడ గడపనుంది.
60కి పైగా వినూత్న ప్రయోగాలు చేసి అత్యంత విలువైన సమాచారాన్ని అందించనుంది. ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా కొత్త చరిత్ర సృష్టించిన శుభాన్షుకు దేశ నలుమూలల నుంచీ అభినందన సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన స్వస్థలం లఖ్నవూలో తల్లిదండ్రులు తదితరులు హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. భారత్ మాతా కీ జై అంటూ నినదించారు. హంగరీ, పోలండ్ దేశాల నుంచి ఒక వ్యోమగామి ఐఎస్ఎస్లో ప్రవేశించడం కూడా ఇదే తొలిసారి. 1984లో రాకేశ్ శర్మ అనంతరం అంతరిక్షంలోకి ప్రవేశించిన రెండో భారతీయునిగా శుభాన్షు నిలవడం తెలిసిందే.
పాపాయిలా నేర్చుకుంటున్నా
ఐఎస్ఎస్ నుంచి శుభాన్షు తొలి పలుకులు
ఐఎస్ఎస్లో ప్రవేశించిన క్షణాలను ‘అత్యద్భుతమైనవి’గా శుభాన్షు అభివరి్ణంచారు. తన అనుభూతిని వీడియో లింకేజ్ ద్వారా అందరితోనూ పంచుకున్నారు. ‘‘తొలిసారి సహజమైన, సంపూర్ణమైన భారరహిత స్థితిలో అడుగుపెట్టా. శూన్యంలో తేలిపోతుంటే కలుగుతున్న అనుభూతి వర్ణనాతీతం!. ఇక్కడంతా కొత్త కొత్తగా, గమ్మత్తుగా ఉంది. నేను ఊహించిన దానికంటే కూడా ఎంతో గొప్పగా ఉంది. ఐఎస్ఎస్లో ప్రవేశించాక సజావుగా నుంచోవడం నేను అనుకున్న దానికంటే తేలికగానే ఉంది. కెమెరాలకు పోజివ్వడం వంటివన్నీ కూడా ఎంతో సరదాగా ఉన్నాయి. కాకపోతే తలే కాస్త భారంగా అనిపిస్తోంది.
పారాడే పాపాయి మాదిరిగా నడక మొదలుకుని అన్నీ మొదటినుంచి కొత్తగా నేర్చుకుంటున్నా. శూన్య స్థితిలో నన్ను నేను నియంత్రించుకోవడానికి ప్రయతి్నస్తున్నా. చివరికి ఎలా తినాలో కూడా నేర్చుకుంటున్న పరిస్థితి!. ఆ క్రమంలో ఎన్నో తప్పటడుగులూ వేస్తున్నా. ఆ పొరపాట్లను పూర్తిగా ఆస్వాదిస్తున్నా. భారరహిత స్థితి అలవాటు లేక నా సహచరులు చేస్తున్న సరదా తప్పిదాలను కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడి పరిస్థితులకు మెల్లిగా అలవాటు పడుతున్నా. అద్భుత దృశ్యాలను ఆస్వాదిస్తున్నా. అన్ని విషయాలనూ ఒక్కొక్కటిగా నేర్చుకుంటున్నా. కొత్త వాతావరణం. ప్రతి క్షణమూ సరికొత్త అనుభూతులు. సహచరులతో కలిసి ప్రయోగాలు చేపట్టేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’’ అని వివరించారు.
శూన్యంలో తేలియాడా
ప్రయోగం పొడవునా ఎదురైన అనుభూతులను శుభాన్షు ఆసక్తికరంగా వివరించారు. ‘‘బుధవారం గ్రేస్ (డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్కు శుభాన్షు బృందం పెట్టుకున్న పేరు)లో కూర్చుని ప్రయోగానికి సిద్ధమైన క్షణాల్లో నాలో ఒకే ఆలోచన మెదిలింది. ‘సరికొత్త చరిత్ర సృష్టించేందుకు బయల్దేరదాం పదా!’ అని నాకు నేను చెప్పుకున్నా. ప్రయోగం మొదలవగానే ఆ విసురుకు నా సీట్లోకి నొక్కుకుపోయా. రోదసిలోకి ప్రవేశించిన తొలి క్షణాల్లో ఏమంత పెద్దగా తేడా అనిపించలేదు. కానీ కాసేపటికే భారరహిత స్థితి తాలూకు మజా అనుభవంలోకి వచ్చింది. ‘వావ్! సూపర్ కదా!!’ అనిపించింది. ఐఎస్ఎస్ చేరేదాకా ఏకబిగిన 28 గంటల పాటు కదలకుండా కూచుని ఉండటం అలసటగా అని్పంచినా చెప్పలేని అనుభూతిని కూడా పంచింది. కాకపోతే చాలాసేపు నిద్రలోనే గడిపా. దాన్ని గుర్తు చేస్తూ నా సహచరులు ఇంకా నన్నెంతగానో ఆటపట్టిస్తున్నారు కూడా’’ అంటూ శుక్లా చెప్పుకొచ్చారు.

అంతరిక్షం నుంచి నమస్కారం!
ఐఎస్ఎస్తో అనుసంధానం అయ్యేముందు భారతీయులందరినీ శుభాన్షు ఆప్యాయంగా పలకరించారు. ‘అంతరిక్షం నుంచి మీకందరికీ నమస్తే. ఈ అద్భుత యాత్రలో ప్రతి భారతీయుడూ నాకు తోడుగా ఐఎస్ఎస్లో ఉన్న భావనే కలుగుతోంది’ అని శుభాన్షు అన్నారు. ‘‘మీ అందరి ప్రేమ, ఆశీస్సులతోనే ఐఎస్ఎస్ చేరగలిగా. మనమంతా కలిసి ఈ యాత్రను మరింత ఉత్సాహభరితంగా మారుద్దాం. మీ అందరితో పాటు త్రివర్ణ పతాకం వెంట రాగా నాతోపాటు ఐఎస్ఎస్ చేరా. ఇది నా ఒక్కని ఘనత కాదు. భారతీయులందరి విజయం. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవసహిత అంతరిక్ష యాత్రకు ఘనమైన ఆరంభం’’ అంటూ శుభాన్షు హర్షాతిరేకాలు వెలిబుచ్చారు.
అరగంట ముందుగానే
డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ అనుకున్న సమయం కంటే అరగంట ముందుగానే ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం వేపాయింట్ 1, 2 వద్ద ఆగకుండా చకచకా ఐఎస్ఎస్ను సమీపించడమే అందుకు కారణం. దానికి 20 మీటర్ల సమీపానికి చేరుకున్నాక డ్రాగన్ తుది అప్రోచ్కు సిద్ధమైంది. లేజర్ ఆధారిత సెన్సర్లు, కెమెరాల సాయంతో ఐఎస్ఎస్ హార్మనీ మాడ్యూల్ తాలూకు డాకింగ్ పోర్ట్తో సవ్యంగా అనుసంధానమైంది. అనంతరం ఐఎస్ఎస్లోని ఏడుగురు సిబ్బంది డ్రాగన్లో ఏమైనా లీకేజీలు తదితరాలు చోటుచేసుకున్నాయేమో తనిఖీ చేశారు. డ్రాగన్ లోపలి పీడనం ఐఎస్ఎస్తో సమానంగా ఉందని నిర్ధారించుకున్నారు. అలా డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిశాక వ్యోమగాములు ఐఎస్ఎస్లోకి అడుగుపెట్టారని నాసా ప్రకటించింది. ఇది దేశమంతటికీ గర్వకారణమని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొంది.
జాయ్.. ఐదో ‘వ్యోమగామి’
శుభాన్షు, మరో నలుగురితో పాటు యాగ్జియం–4 మిషన్ ద్వారా ఐదో వ్యోమగామి ‘జాయ్’ కూడా ఐఎస్ఎస్ చేరింది! అదెవరా అని ఆశ్చర్యపోతున్నారా? నిజానికి అదొక హంస బొమ్మ!. వ్యోమగాములు జీరో గ్రావిటీ (శూన్య స్థితి)కి చేరగానే వారిని అలర్ట్ చేస్తుందన్నమాట. జీరో గ్రావిటీని సూచించే బొమ్మలను ఇలా అంతరిక్షంలోకి వెంట తీసుకెళ్లడం తొలి రోదసి యాత్రికుడు యూరీ గగారిన్ నాటినుంచీ వస్తున్న ఆనవాయితీ. దానికి కొనసాగింపుగా జాయ్ బొమ్మను యాగ్జియం–4 బృందం తమ వెంట తీసుకెళ్లింది.
శుభాన్షు కుమారుని కోసం..
శుభాన్షు కుమారుడు కియశ్కు జంతువులంటే ఉన్న ప్రేమను దృష్టిలో పెట్టుకుని హంస బొమ్మను ఎంపిక చేసుకున్నట్టు యాగ్జియం–4 మిషన్ కమాండర్ వాట్సన్ చెప్పడం విశేషం! పాలను, నీటిని వేరుచేసే హంస భారతీయ సంప్రదాయంలో జ్ఞానానికి అత్యున్నత ప్రతీక అని శుభాన్షు తన సహచర వ్యోమగాములకు వివరించారు.
నంబర్ 634
శుభాన్షు అంతరిక్షంలోకి వెళ్లిన 634వ వ్యోమగామిగా నిలిచారు. అందుకు గుర్తుగా ఐఎస్ఎస్లో ఆయనకు వ్యోమగామి నంబర్ 634 అంటూ అధికారికంగా స్పేస్ స్టేషన్ పిన్ కేటాయించారు. ‘‘నేను ఆస్ట్రోనాట్ నంబర్ 634ను. ఇక్కడ ఉండటం నిజంగా గర్వకారణంగా అనిపిస్తోంది. ఐఎస్ఎస్ నుంచి భూమిని చూసే అవకాశం దక్కిన అతి కొద్ది మందిలో నాకు చోటు దక్కడం ఎంతో ఆనందంగా ఉంది’’ అని శుభాన్షు వ్యాఖ్యానించారు.