ఇస్లామాబాద్లో ఓ మహిళను అపహరించేందుకు దుండగులు ప్రయత్నించగా, ఆమెను కాపాడే క్రమంలో జోక్యం చేసుకున్న పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ను వారు కాల్చిచంపినట్టు పాకిస్థాన్ సమా టీవీ తెలిపింది.
ఈ ఘటన మార్గల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహీన్ చౌక్ వద్ద జరిగింది. మృతుడిని గ్రూప్ కెప్టెన్ అసీమ్ తారిక్గా గుర్తించారు. ఆయన నైన్త్ అవెన్యూ మీదుగా వెళ్తుండగా ఓ వ్యక్తి మోటార్సైకిల్పై ఓ మహిళను బలవంతంగా ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నట్టు గమనించినట్టు సమాచారం.
సమా టీవీ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రూప్ కెప్టెన్ తారిక్ జోక్యం చేసుకుని దాడిని అడ్డుకున్నారు. దీంతో ఆ మహిళ రోడ్డుకు అవతలి వైపునకు పారిపోయింది. ఈ సమయంలో అనుమానితుడు సాద్ అధికారి పట్ల దుర్భాషలాడి, ఆ తర్వాత కాల్పులు జరిపినట్టు తెలిపింది. ఈ కాల్పుల్లో అధికారి తీవ్రంగా గాయపడి ఘటన స్థలంలోనే మృతి చెందగా, నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆధారాలు సేకరిస్తున్నారు. మహిళ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ సమా టీవీ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఆమె సహోద్యోగి. ఉద్యోగానికి తీసుకెళ్తానని చెప్పి మార్గం మళ్లించి మరో చోటుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడని తెలిపింది. ఆమె ప్రతిఘటించడంతో పరిస్థితి మరింత విషమించేలోపు అధికారి జోక్యం చేసుకున్నారు.
అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నక్వీ ఈ ఘటనపై ఇస్లామాబాద్ పోలీస్ చీఫ్ నుంచి అత్యవసర నివేదిక కోరారు. నిందితుడిని వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు.


