సంభాల్‌ హింస: ఎంపీ సహా 400 మందిపై కేసు | Samajwadi Party MP Among 400 Charged For Violence In UP's Sambhal | Sakshi
Sakshi News home page

సంభాల్‌ హింస: సమాజ్‌ వాదీ ఎంపీతో సహా 400 మందిపై కేసులు నమోదు

Nov 25 2024 2:59 PM | Updated on Nov 25 2024 4:32 PM

Samajwadi Party MP Among 400 Charged For Violence In UP's Sambhal

ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్‌లో ఆదివారం చెలరేగిన హింసాత్మక ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. దాదాపు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. 400 మందిపై ఏడు కేసులు నమోదు చేశారు. 

కేసు నమోదైన వారిలో సంభాల్‌ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ నేత జియావుర్‌ రెహమాన్‌, స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్‌ మెహమూద్‌ కుమారుడు సోహైల్‌ ఇక్బాల్‌ కూడా ఉన్నారు. వీరిద్దరూ హింసకు పాల్పడటంతోపాటు జనాలను గుంపులుగా సమీకరించి, అశాంతిని రెచ్చగొట్టడం వంటివి పాల్పడ్డారని అభియోగాలు మోపుతూ కేసు నమోదు చేశారు.

కాగా సంభాల్‌ పట్టణంలో మొగల్‌ కాలానికి చెందిన షాహీ జామా మసీదు ఉన్న చోట గతంలో హరిహర మందిరం ఉండేదన్న ఫిర్యాదుతో న్యాయస్థానం సర్వేకి ఆదేశించింది. దీంతో ఆదివారం సర్వే నిర్వహిస్తుండగా హింస చేలరేగింది. గుంపుగా వచ్చిన కొందరు స్థానికులు సర్వేకు వ్యతిరేంగా మసీదు ముందు నినాదాలతో ఆందోళనకు దిగారు. 
చదవండి: ఘొర పరాజయం.. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా

పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలకు నిప్పు పెట్టారు. స్పందించిన పోలీసులు లాఠీలు, టియర్ గ్యాస్ షెల్స్‌ ఉపయోగించారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అల్లర్లలో నలుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. రాళ్ల దాడిలో సీఐ సహా 15 నుంచి 20 మంది పోలీసులకు సైతం గాయాలయ్యాయి.

ఈ ఘటనపై అధికార బీజేపీ, కాంగ్రెస్‌ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్, హింసను కాంగ్రెస్ ప్రేరేపిస్తోందని బీజేపీ ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఇక సోమవారం సంభల్‌ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. స్కూళ్లను బంద్‌ చేశారు. ప్రజలు గుంపులుగా గుమిగూడటంపై నిషేధం విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement