
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో వరుస అత్యాచార ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆర్జీకార్ ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచార ఘటన మరువక ముందే.. కోల్కతాలోని ఓ న్యాయ కళాశాల ప్రాంగణంలోనే విద్యార్థిని సామూహిక అత్యాచారం జరగడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో వరుస ఘటనలపై ఆర్జీకర్ వైద్యురాలి తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వ ఉదాసీనత వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
బెంగాణలో పరిస్థితులపై తాజాగా ఆర్జీకర్ వైద్యురాలి తండ్రి స్పందిస్తూ..‘న్యాయ కళాశాల ప్రాంగణంలోనే విద్యార్థిని సామూహిక అత్యాచారం జరగడం దారుణం. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ ఎందుకు జరుగుతున్నాయి. రాష్ట్రంలో తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఇలా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ముగ్గురు అధికార టీఎంసీకి చెందిన వారే. గతంలో నా కుమార్తె అత్యాచారానికి గురైనప్పుడు వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. దీంతో, ఇలాంటి ఘటనలు పునరావృతం కావని భావించాం. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. కాబట్టి రాజకీయ పార్టీలే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు.
ఘటన వివరాలు..
ఇదిలా ఉండగా.. దక్షిణ కోల్కత్తా లా కాలేజీ విద్యార్థిపై కాలేజీలోనే అత్యాచారం జరిగింది. అదే కాలేజీకి చెందిన మాజీ విద్యార్థి ఇద్దరు ప్రస్తుత విద్యార్థులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. పరీక్షకు సంబంధించిన పత్రాలను నింపేందుకు బాధితురాలు (24) బుధవారం మధ్యాహ్నం కాలేజీకి వెళ్లింది. విద్యార్థి సంఘం గదిలో కూర్చుని పత్రాలు నింపుతుండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా (31) అక్కడికి వచ్చాడు. ఆమెతోపాటు మరో ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టి టీఎంసీపీ గురించి, తన అధికారాల గురించి మాట్లాడాడు. బాధితురాలిని కళాశాల విద్యార్థిని విభాగం కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు.
సాయంత్రం దాకా ఆమెను ఒక్కదాన్నే ఆ గదిలో కూర్చోమని చెప్పాడు. అనంతరం జరిగిన పరిణామాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ‘మోనోజిత్ గదిలోకి వచ్చి, ఉన్నట్టుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రతిపాదించాడు. దాంతో విస్తుపోయా. ఇంకొకరితో ప్రేమలో ఉన్నానంటూ అందుకు నిరాకరించా. దాంతో ఒక్కసారిగా ఆగ్రహించాడు. కాలేజీ మెయిన్ గేట్కు తాళం వేయాల్సిందిగా అక్కడి వారిని ఆదేశించాడు. నన్ను పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు.
మోనోజిత్ బెదిరింపు..
మా కాలేజీలో ఫస్టియర్ చదువుతున్న జయీబ్ అహ్మద్ (19), ప్రమీద్ ముఖర్జీ (20)తో కలిసి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే అడ్డుకుని చేయిచేసుకున్నాడు. బాయ్ఫ్రెండ్ ఉన్నాడని, వదిలేయాలని కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదు. ఈ దారుణాన్ని జయీబ్, ప్రమీద్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను నా బంధుమిత్రులకు పంపుతామని బెదిరించారు. కాలేజీ గార్డు కూడా నన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. బుధవారం రాత్రి 7.30 నుంచి 10.50 మధ్య ఈ దారుణం జరిగింది. దీని గురించి ఎవరికైనా చెబితే దారుణ పరిణామాలుంటాయని మోనోజిత్ బెదిరించాడు. నా బోయ్ఫ్రెండ్కు హాని తలపెడతామని, తల్లితండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టాడు’’ అని వాపోయింది. ‘‘క్రూరమైన లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడ్డా. ఒక దశలో శ్వాస కూడా అందలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా మోనోజిత్ పట్టించుకోలేదు. పైగా హాకీ స్టిక్ చూపించి, కొడతానని బెదిరిస్తూ వెళ్లిపోయాడు’’ అని వివరించింది.

‘‘ప్రధాన నిందితునికి మిగతా ఇద్దరు సహకరించారు. గది బయట కాపలాగా ఉన్నారు’’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ముగ్గురు నిందితులకు కోర్టు ఐదు రోజుల రిమాండ్ విధించింది. ప్రధాన నిందితునికి సహకరించడం కూడా అత్యాచారానికి పాల్పడటంతో సమానమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ‘‘బాధితురాలు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలమిచ్చింది. ఘటన జరిగిన గార్డు గదితోపాటు పక్కనే ఉన్న విద్యార్థి సంఘం గదిని సీజ్ చేసి, ప్రత్యక్ష సాక్షులను విచారించాం’’ అని పోలీసులు తెలిపారు.