
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండకు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతనాగ్ జిల్లా పెహల్గాం పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా చేసిన దాడిలో 26 మంది పర్యాటకులు అసువులు బాసారు. పెహల్గాంలోని బైసరాన్కు విహార యాత్రలోభాగంగా , ప్రకృతి అందాలను వీక్షిస్తున్న తరుణంలో ఉగ్రమూకలు వారిపై దాడికి తెగబడ్డారు. దాంతో ఆ ఆనంద క్షణాలు కాస్తా విషాదంగా మారిపోయాయి. ఉగ్రదాడిలో చనిపోయిన వారిలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కుమారుడు ఉన్నారు.
ఐబీ(ఇంటెలిజెన్సీ బ్యూరో) ఆఫీసర్ గా హైదరాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్న మనీష్ రంజాన్.. ఉగ్రమూకల దాడిలో ప్రాణాలు విడిచాడు. రంజాన్ మృతదేహం బుధవారం స్వస్థలానికి చేరుకున్న తరుణంలో ఆయన తండ్రి మంగ్లేస్ మిశ్రా కన్నీటి పర్యంతమయ్యారు. కుమారుడి మృతదేహాన్ని చూస్తూ కృంగిపోయారు. ఈ క్రమంలోనే జాతీయ మీడియా ఆయన్ని పలకరించగా తాను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నానని, ఒంటరిగా ఉన్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
‘నన్ను ఒంటరిగా వదిలేయండి. నేనే మాట్లాడలేను. కశ్మీర్ కు నవ్వుతూ వెళ్లాడు నా కుమారుడు రంజన్. ప్రతీరోజూ మాకు కాల్ చేసి మా ఆరోగ్యం గురించి అడిగేవాడు.. జాగ్రత్తలు చెప్పేవాడు. తాను అసువులు బాసిన చివరి రోజు కూడా మాకు కాల్ చేశాడు. అంతకుముందే మా కాల్ చేసి మాట్లాడిన నా కుమారుడు ఇలా వస్తాడని అనుకోలేదు’ అంటూ కన్నీటి వేదనతో చెప్పారు.