
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను సందర్శించారు. ‘ఆపరేషన్ సిందూర్’ విజయం తర్వాత ఆయన ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ను దర్శించారు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్(INS Vikrant)ను అరేబియా సముద్రంలో మోహరించారు.
ఐఎన్ఎస్ విక్రాంత్ సందర్శన అనంతరం రక్షణ మంత్రి నావికాదళ అధికారులు, సైనికులను కలుసుకుని, ఆపరేషన్ సింధూర్లో సాధించించిన విజయంపై వారిని అభినందించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో, భారత నావికాదళ బృందానికి ఐఎన్ఎస్ విక్రాంత్ నాయకత్వం వహించింది. దీనిలో డిస్ట్రాయర్లు, స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్(Stealth Guided Missile Frigate)లు మొదలైన 10 యుద్ధనౌకలు ఉన్నాయి. పాక్ ఉద్రిక్తతలను మరింతగా పెంచిన పక్షంలో భారత నావికాదళం యుద్ధనౌకలను మాత్రమే కాకుండా భూ లక్ష్యాలను కూడా టార్గెట్ చేసుకుంటుందని ఈ మోహరింపు పాకిస్తాన్కు స్పష్టమైన సందేశాన్నిచ్చింది. ఫలితంగా పాకిస్తాన్ నావికాదళం కరాచీ నావికా స్థావరం నుండి ముందుకు వచ్చేందుకు ధైర్యం చేయలేకపోయింది. కాల్పుల విరమణకు డిమాండ్ చేసింది.
Goa | Defence Minister Rajnath Singh onboard at INS Vikrant.
(Source: RM Office) pic.twitter.com/k2OqUvOXG9— ANI (@ANI) May 30, 2025
ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాన్ని జరుపుకునేందుకు, నావికా దళాలలో మనోధైర్యాన్ని పెంచేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఐఎన్ఎస్ విక్రాంత్ను సందర్శించారు. దీనికిముందు ఆయన శ్రీనగర్లో ఆర్మీ అధికారులను, భుజ్లోని వైమానిక దళాన్ని కలుసుకున్నారు. కాగా రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ను 2022 సెప్టెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత నావికాదళంలో చేర్చారు. 45,000 టన్నుల బరువున్న ఈ విమాన వాహక నౌక 76 శాతం మేరకు స్వదేశంలోనే తయారయ్యింది.
ఇది కూడా చదవండి: 20 ఏళ్ల కుర్రాడు.. 16వ అంతస్థు నుంచి దూకి..