
భార్యభర్తల బంధాలకు ఈ మధ్యకాలంలో అనూహ్య ముగింపు లభిస్తోంది. వివాహేతర సంబంధాలతోనో, పాత పరిచయాల కోసమే ఒకరినొకరు కడతేర్చుతున్న ఘటనలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సెల్ఫీ కోసం ఓ బ్రిడ్జి మీద ఆగిన కొత్తజంట.. వీడియోతో నెట్టింట రచ్చ చేస్తోంది. తన బావ(భర్త) ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయాడని ఆ నవవధువు, లేదు తన భార్యే తనను తోసేసి చంపాలని చూసిందని ఆ భర్త హల్ చల్ చేశారు. కర్ణాటక రాయ్చూర్లో తాజాగా జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
కాడ్లూరు సమీపంలో కృష్ణా నది వంతెన మీదుగా బైక్ మీద వెళ్తున్న ఓ జంట ఆగింది. కాసేపటికే ఆ వ్యక్తి చేతులు ఊపుతూ సాయం కోసం అరవసాగాడు. ఈలోపు వంతెన మీద ఉన్న అతని భార్య దారినపోయే వాళ్లను రక్షించమని సాయం కోరుతూ కనిపించింది. ఇది గమనించిన మత్స్యకారులు కొందరు తాడు సాయంతో ఆ వ్యక్తిని వంతెన పైకి తీసుకొచ్చారు.
తమకు ఈ మధ్యే వివాహం అయ్యిందని, సెల్ఫీ దిగుదామని తన భార్య కోరిందని.. ఆ సమయంలో ఆమె తనను నీళ్లలోకి తోసేసిందని, ఎలాగోలా వచ్చిన కాస్త ఈతతో ఈదుకుంటూ బండరాళ్ల మీదకు చేరానని, తనను చంపేందుకు కుట్ర పన్నిందని సదరు వ్యక్తి వాపోయాడు. అయితే కాలు జారి తన భర్త నదిలో పడిపోయాడని, తనకు ఎలాంటి పాపం తెలియదని ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది. దీంతో అక్కడ ఉన్నవాళ్లు ఆ జంటను స్థానికంగా ఉన్న పీఎస్కు తీసుకెళ్లగా.. వాళ్లు పెద్దల సమక్షంలో ఆ జంటకు కౌన్సెలింగ్ ఇప్పించి పంపించినట్లు తెలుస్తోంది.
A newlywed man in #Raichur was allegedly pushed into the River by his wife during a photoshoot near Gurjapur Bridge.He clung to rocks & was rescued by fishermen.The wife claimed it was accidental but husband accused her of a deliberate act.Police are investigating the viral video pic.twitter.com/4Da9x8ShXx
— Yasir Mushtaq (@path2shah) July 12, 2025