ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వీబీ-జీ-రామ్ జీ బిల్లుపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ ఒంటి చేత్తో రాష్ట్రాలతో పాటు పేదల బతుకులపై దాడి చేశారన్నారు.నోట్ల రద్దు మాదిరిగా ఈ నిర్ణయం సైతం ఏక పక్షంగా తీసుకున్నారని తెలిపారు. వీబీ- జీ-రామ్ బిల్లుకు నిరసనగా త్వరలో దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని రాహుల్ తేల్చి చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల మహత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో నూతనంగా "వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్" (వీబీ-జీ రామ్ జీ) బిల్లు ప్రవేశపెట్టింది. దీనికి పార్లమెంటు లోని ఊభయ సభలు ఆమోదం తెలిపాయి. కాగా ఈ పథకానికి మహత్మా గాంధీ పేరు మార్చడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తుంది. ఈ చర్యలు ఖచ్చితంగా మహాత్మున్ని అవమానించడమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "ప్రధాని మోదీ ఒంటి చేత్తో రాష్ట్రాల్ని, పేదల్ని దెబ్బకొట్టారు. నోట్లరద్దు సమయంలో మాదిరి ఇప్పుడు అలానే వ్యవహరించారు. ప్రతిపక్షాలతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా MGNREGA పథకాన్ని రద్దు చేశారు. దీనిని మేము పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయంలో ప్రతిపక్షాలు సైతం మాతో కలిసి వస్తాయని ఆశిస్తున్నాం". అని రాహుల్ అన్నారు.మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయన్నారు. అటువంటి గొప్ప పథకాన్ని రద్దు చేయడం రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడేమనని తెలిపారు.
వీబీ-జీ-రామ్ జీ బిల్లుకు నిరసనగా జనవరి 5నుంచి ప్రత్యేకంగా MGNREGA బచావ్ అభియాన్ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. MGNREGA స్థానంలో ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన వీబీ-జీ-రామ్-జీ బిల్లు గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన వారికి 125 రోజుల పని కల్పిస్తుంది.


