ప్రమిదల తయారీలో రాహుల్‌ గాంధీ... | Rahul Gandhi Celebrates Diwali By Learning Pottery And Painting From Local Artisans | Sakshi
Sakshi News home page

ప్రమిదల తయారీలో రాహుల్‌ గాంధీ...

Nov 2 2024 5:47 AM | Updated on Nov 2 2024 5:47 AM

Rahul Gandhi Celebrates Diwali By Learning Pottery And Painting From Local Artisans

శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కే వ్యవస్థ రావాలన్న కాంగ్రెస్‌ అగ్ర నేత

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ మరోమారు వృత్తి పనివారల ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన సుమారు 9 నిమిషాల వీడియోను శుక్రవారం ‘ఎక్స్‌’లో విడుదల చేశారు. ఢిల్లీలో మట్టి ప్రమిదలను తయారు చేసే మహిళ ఇంటికి రాహుల్‌ గాంధీ వెళ్లారు. ప్రమిదలను సొంతంగా తయారు చేసేందుకు ప్రయతి్నంచారు. వీటిని తన తల్లి సోనియా గాం«దీ, సోదరి ప్రియాంకా గాంధీ వాద్రాకు ఇస్తానన్నారు. 

‘ప్రత్యేకమైన వ్యక్తులతో గుర్తుండిపోయే దీపావళి ఇది. దీపావళి నాడు పెయింటర్‌ సోదరులతో, కుమ్మరి వృత్తి పని వారి కుటుంబంతో పనిచేస్తూ గడిపాను. వారి వృత్తి పనిని దగ్గర్నుంచి గమనించాను. వారి పనితనాన్ని అలవాటు చేసుకునేందుకు ప్రయతి్నంచాను. వారి కష్టనష్టాలను అర్థం చేసుకున్నాను. మనం కుటుంబంతో కలిసి పండగలను సంతోషంతో జరుపుకుంటాం. 

వారు మాత్రం ఎంతోకొంత డబ్బు సంపాదించుకునేందుకు సొంతింటిని, కుటుంబాన్ని, సొంతూరిని, నగరాన్ని మర్చిపోతున్నారు’అని అనంతరం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ‘మట్టిలోనే వారు సంతోషం వెదుక్కుంటున్నారు. ఇతరుల జీవితాల్లో పండుగ వెలుగుల కోసం ప్రయత్నిస్తూ..తమ జీవితాల్లో వెలుగులు నింపుకోగలుతున్నారా? ఇళ్లను నిర్మించే వీరికి సొంతిల్లు కూడా ఉండటం గగనంగా మారింది’అని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమకు, నైపుణ్యానికి తగిన ప్రతిఫలం, ఆత్మగౌరవాన్ని అందించే వ్యవస్థను మనం తయారు చేసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఈ దీపావళి అందరికీ సుఖ సంతోషాలను ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు.

10, జన్‌పథ్‌ బంగ్లా అంటే పెద్దగా ఇష్టం లేదు
ఢిల్లీలోని ల్యుటెన్స్‌ ప్రాంతంలో ఉన్న 10, జన్‌పథ్‌ బంగ్లా అంటే తనకు పెద్దగా ఇష్టం లేదని రాహుల్‌ గాంధీ చెప్పారు. తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో హత్యకు గురైన సమయంలో ఈ బంగ్లాలోనే ఉన్నారని, అందుకే అంతగా ఇష్టం లేదని ఆయన గురువారం చెప్పారు. జన్‌పథ్‌ బంగ్లాకు రంగులు వేసే కారి్మకులతో కలిసి పనిచేశారు. ఈ సందర్భంగా సోదరి ప్రియాంకా గాంధీ కుమారుడు, మేనల్లుడు రైహాన్‌ రాజీవ్‌ వాద్రాతో ఈ మేరకు చేసిన సంభాషణ వీడియోను ఆయన విడుదల చేశారు. రాహుల్‌ గాంధీ చిన్నప్పటి నుంచి 10, జన్‌పథ్‌ బంగ్లాలోనే గడిపారు. రాజీవ్‌ గాంధీ హత్యానంతరం తల్లి సోనియా గాం«దీకి ఈ భవనాన్ని కేటాయించారు. రాహుల్‌ ఎంపీ అయ్యాక తుగ్లక్‌ లేన్‌లోని 12వ నంబర్‌ బంగ్లాకు మకాం మార్చారు. 2023లో పరువునష్టం కేసులో అనర్హత వేటు పడటంతో తల్లి ఉండే జన్‌పథ్‌ బంగ్లాకు మారారు. అనర్హత వేటు తొలిగి, మళ్లీ ఎంపీ అయ్యాక కూడా రాహుల్‌ ఇక్కడే ఉంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement