బెంగళూరు: ధర్మస్థల వ్యవహారంలో తన పేరును లాగుతూ చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్రాజ్ స్పష్టం చేశారు. ధర్మస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి రూ.200 కోట్లు అందుకున్నానంటూ ముసుగువ్యక్తిగా గుర్తింపు పొందిన చిన్నయ్య చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.
‘‘చిన్నయ్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇప్పటివరకు ధర్మస్థలకు ఒక్కసారి కూడా వెళ్లలేదు. ఆలయ వ్యవహారాలతో సంబంధం ఉన్నవారిని కూడా కలవలేదు’’ అని వెల్లడించారు.
బెంగళూరు ప్రెస్క్లబ్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ప్రకాశ్రాజ్.. తన సహచర కార్యకర్త గిరీశ్ మట్టణ్ణనవర్ ద్వారా చిన్నయ్య ఫోన్లో మాట్లాడాడని తెలిపారు. ‘‘ధర్మస్థల అంశంపై మాట్లాడాలని అతడు కోరాడు. అయితే ఇలాంటి విషయాలు నాతో కాకుండా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు చెప్పాలని సూచించాను. అతని మాటలు అనుమానంగా అనిపించాయి. అందుకే ఆ సంభాషణను రికార్డు చేసి సిట్ చీఫ్కు కూడా పంపించాను’’ అని చెప్పారు.
ధర్మస్థలలో వెలుగుచూసిన అనుమానాస్పద మరణాలు, బాధిత కుటుంబాలు వ్యక్తం చేసిన సందేహాల నేపథ్యంలోనే తాను స్పందించానని ప్రకాశ్రాజ్ పేర్కొన్నారు. ‘‘సామాజిక బాధ్యతతోనే ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు జరపాలని కోరాను. ఇందులో వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలేమీ లేవు’’ అని స్పష్టం చేశారు.
చిన్నయ్య ఆరోపణలపై స్పందిస్తూ, ‘‘ధర్మస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కేరళ నుంచి రూ.200 కోట్లు తీసుకున్నాననే ఆరోపణలకు ఆధారాలేంటి?’’ అని ప్రశ్నించారు.
తనను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కొన్ని వర్గాల మీడియా చిన్నయ్య వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ధర్మస్థల ప్రతిష్ఠకు తాను మసి పూసేందుకు ప్రయత్నిస్తున్నానని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారాయన. తాను దేవాలయాలకు వెళ్లనప్పటికీ తన భార్య భక్తురాలని, ఆమె విశ్వాసాలను ఎప్పుడూ ప్రశ్నించలేదన్నారు. ధర్మస్థలలో విద్యార్థిని సౌజన్య హత్య కేసులో నిజాలు బయటపడాలని, నిందితులకు కఠిన శిక్ష పడాలని మాత్రమే తాను కోరుకుంటున్నానని స్పష్టం చేశారు.
విలేకరులతో మాట్లాడిన టైంలో.. ‘అమ్ముడుబోయిన ప్రచార మాధ్యమాలు’ అంటూ చేసిన ప్రకాశ్రాజ్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో కాసేపు అక్కడ గందరగోళం నెలకొంది. అయితే ప్రకాశ్రాజ్ ఆ వ్యాఖ్యలపై క్షమాపణలు మాత్రం చెప్పలేదు. ఆపై వివరణ ఇస్తూ.. ఆ వ్యాఖ్యలు మీడియా మొత్తాన్ని ఉద్దేశించి చేసినవి కావని, కొందరికి మాత్రమే వర్తిస్తాయని అన్నారు. దీంతో మీడియా ప్రతినిధులు శాంతించడంతో.. ప్రెస్మీట్ కొనసాగింది.
Prakash Raj called a press meet to clarify Chinnayya's claim that they had spoken during the alleged Dharmasthala hoax mass burial kconspiracy.
He invited the "sold-out Godi Media."
The media turned up.
Then came the questions and a heated exchange. #Dharmasthala #Massburial pic.twitter.com/j8uVCMfba5— Harish Upadhya (@harishupadhya) June 17, 2026
కర్ణాటకలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన ధర్మస్థల వ్యవహారం గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రాంతంలో 1995-2014 మధ్య కాలంలో పలువురు మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని, ఆ మృతదేహాలను తానే ఖననం చేశానంటూ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్య (ముసుగువ్యక్తి) సంచలన ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. అయితే అనంతరం చిన్నయ్య తన వాంగ్మూలాన్ని మార్చుకుంటూ.. ధర్మస్థల ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి రూ.200 కోట్ల కుట్ర జరిగిందని, అందులో ప్రకాశ్రాజ్ సహా పలువురి పేర్లు ప్రస్తావించాడు. మరోవైపు 2012లో ధర్మస్థల సమీపంలో హత్యకు గురైన విద్యార్థిని సౌజన్య కేసులో అసలు నిందితులు శిక్ష తప్పించుకున్నారనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ధర్మస్థల, సౌజన్య కేసులపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలు వెలికితీయాలని ప్రకాశ్రాజ్ డిమాండ్ చేస్తున్నారు.


