బాలోత్రా: రాజస్థాన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిని అధిగమిస్తూ.. బాలోత్రా జిల్లా పచ్పద్ర వద్ద ఏర్పాటు చేసిన మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను మోదీ ప్రారంభించారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో సుమారు రూ. 79,450 కోట్లకు పైగా పెట్టుబడితో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను అభివృద్ధి చేశారు.
సుమారు రూ. 1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయడంతో పాటు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. జోధ్పూర్ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. సవాలు ఎంత పెద్దదైనా.. ఊహించనిదైనా సరే.. భారత్ తన సంకల్పం నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ విధానాలతో పాటు బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కారణంగా సంక్షోభం నుంచి భారత్ తక్కువ భారంతో బయటపడిందని చెప్పుకొచ్చారు. చిన్న చిన్న ఇబ్బందులు తప్ప.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంధన సరఫరాలో పెద్దగా సవాళ్లు ఎదురు కాలేదన్న మోదీ.. ప్రజలపై ఎటువంటి అదనపు భారం పడకుండా చూశామన్నారు. జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ప్రారంభం దేశ అభివృద్ధి ప్రయాణంలో మరో ముఖ్యమైన అడుగు అని.. ఇది మార్వార్ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలకు పెద్ద పీట వేస్తుందని ప్రధాని అన్నారు.


