ప్రధాని రోడ్‌ షోకు అనుమతి నిరాకరణ | Permission denied for PM Roadshow in Coimbatore Citing Security Risk | Sakshi
Sakshi News home page

ప్రధాని రోడ్‌ షోకు అనుమతి నిరాకరణ

Mar 15 2024 5:50 PM | Updated on Mar 15 2024 6:39 PM

Permission denied for PM Roadshow in Coimbatore Citing Security Risk - Sakshi

చెన్నై: లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేశాయి. బీజేపీ, కాంగ్రెస్‌తో సహా ప్రాంతీయ పార్టీలు సైతం అభ్యర్ధుల ప్రకటన, ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.  శుక్రవారం తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల పర్యటన చేపట్టిన మోదీ.. వచ్చేవారం మరోసారి తమిళనాడులో పర్యటించనున్నారు.

మార్చి 18న ప్రధాని కోయంబత్తూర్‌లో 3.6 కిలోమీటర్ల రోడ్‌ షో నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో దాదాపు లక్షమంది పాల్గొనే అవకాశముందని తెలిపింది. అయితే  కోయంబత్తూర్‌లో నిర్వహించే ప్రధాని రోడ్‌షోకు రాష్ట్ర పోలీసులు అనుమతివ్వలేదు. భద్రతాపరమైన కారణాలు, ప్రజలకు అసౌకర్యం, ముఖ్యంగా విద్యార్ధులకు ఇబ్బంది తదితర కారణాల దృష్ట్రా జిల్లా పోలీసు అధికారులు అనుమతి నిరాకరించారు. అలాగే రోడ్‌షో కోసం బీజేపీ ఎంచుకున్న మార్గం మత ఘర్షణలు చెలరేగేందుకు అవకాశాలున్న ప్రాంతమని పోలీసులు పేర్కొన్నారు.

కాగా  మోదీ రోడ్‌ షో చేసే కోయంబత్తూరులోని ఆర్‌ఎస్‌ పురంలో 1998లో వరస పేలుళ్లు జరిగాయి. అప్పటి నుంచి ఈ ప్రాంతంపై పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు. అక్కడ మతపరమైన ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నందున ఏ రాజకీయ పార్టీలు, సంఘాలకు రోడ్‌షోలకు అనుమతి ఇవ్వడం లేదు. 
చదవండి: కేరళలో కమలం వికసిస్తుంది: ప్రధాని మోదీ

Advertisement
 
Advertisement
Advertisement